Akunuri Murali: ఆకునూరి మురళి సడెన్ రిజైన్ వెనుక అసలు రీజన్ వేరే ఉందా? ఆ మూడు కారణాలే రాజీనామాకు దారితీశాయా?

అప్పటి నుంచి తరుచూ అప్పటి కేసీఆర్‌ ప్రభుత్వం తీరు తప్పుబడుతూ..అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ నేతలకు దగ్గరైన ఆకునూరి మురళి..

  • Updated on- May 24, 2026 / 11:07 PM IST

 

  • ఆకునూరి మురళి రాజీనామా వెనుక రీజన్ వేరే ఉందా.?
  • బాధ్యత పూర్తి చేశానంటూ..పదవి నుంచి తప్పుకోవడంపై చర్చ
  • ఆ మూడు కారణాలే ఆయన రాజీనామాకు దారితీశాయా.?
  • ప్రభుత్వ పెద్దలతో ఆకునూరి మురళికి గ్యాప్ ఏర్పడిందా.?

Akunuri Murali: ఆయనో ఐఏఎస్‌ అధికారి. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ..వీఆర్ఎస్‌ తీసుకుని..కేసీఆర్ ప్రభుత్వం గద్దె దిగే వరకు అసమ్మతి గళం వినిపిస్తూ వచ్చారు. కట్ చేస్తే రేవంత్ సర్కార్‌ పవర్‌లోకి వచ్చాక..విద్యా కమిషన్ ఛైర్మన్ అయ్యారు. ఇప్పుడు ఇంకో నాలుగు నెలల పదవీకాలం ఉండగానే తన పోస్ట్‌కు రిజైన్ చేసి చర్చకు దారితీశారు. ఆకునూరి మురళి రాజీనామాకు కారణమేంటి?

తెలంగాణ విద్యా కమిషన్‌ ఛైర్మన్‌ ఆకునూరి మురళి రాజీనామా..చర్చనీయాంశంగా మారింది. తనకు ఇచ్చిన బాధ్యతను పూర్తి చేశానని, బాధ్యత పూర్తవడంతో రాజీనామా చేస్తున్నట్టు సీఎస్‌కు రాసిన లేఖలో ప్రస్తావించారాయన. 2024 సెప్టెంబర్‌ 6న ఆకునూరి మురళి ఛైర్మన్‌గా తెలంగాణ విద్యా కమిషన్‌ను సర్కార్‌ ఏర్పాటు చేసింది. రెండేళ్ల కాలానికి ఆయనను చైర్మన్‌గా నియమించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో రెండేళ్ల పదవీకాలం పూర్తి కానుంది. నాలుగు నెలల పదవీకాలం ఉండగానే ఆయన రాజీనామా చేయడం కలకలం రేపుతోంది.

అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో, ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంలో..

విద్యా వ్యవస్థపై మంచి పట్టున్న ఆకునూరి మురళి..గతంలో కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలోనూ హాట్ టాపిక్‌గా నిలిచారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా పని చేసిప్పుడు మాంసాహారం విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఆ తర్వాత ఏడాది సర్వీస్‌ ఉండగానే వీఆర్ఎస్ తీసుకున్నారు. అప్పటి నుంచి తరుచూ అప్పటి కేసీఆర్‌ ప్రభుత్వం తీరు తప్పుబడుతూ..అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ నేతలకు దగ్గరైన ఆకునూరి మురళి..రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక విద్యా కమిషన్ ఛైర్మన్ అయ్యారు. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడెన్‌గా రిజైన్ చేసి మరోసారి న్యూస్‌ హెడ్‌లైన్‌గా మారారు.

ప్రభుత్వమే రాజీనామా చేయించిందా?

ఇక నీట్‌ పేపర్‌ లీక్‌ విషయంలో ఆకునూరి మురళి ఓ సోషల్ మీడియా గ్రూప్‌లో పెట్టిన పోస్ట్‌పై ఇష్యూ అయింది. దీంతో ప్రభుత్వమే ఆయనతో రాజీనామా చేయించిందా అన్న ఊహాగానాలు కూడా ఉన్నాయి. తనకు అప్పగించిన పని పూర్తి చేశా..అందుకే రిజైన్ చేస్తున్నా అని రాజీనామా లేఖలో చెప్పుకొచ్చారు ఆకునూరి మురళి. అలా అయితే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన వెంటనే ఎందుకు విద్యా కమిషన్ ఛైర్మన్ పోస్ట్ నుంచి తప్పుకోలేదన్న ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. ఇక విద్యా కమిషన్‌ ఏర్పాటు అయినప్పటి నుంచి ప్రభుత్వానికి 9 నివేదికలు ఇచ్చినట్లు తెలుస్తోంది. 434 సిఫార్సులు చేసినట్లు చెప్తున్నారు. అయితే కమిషన్‌ సిఫార్సులను సర్కార్‌ సీరియస్‌గా తీసుకోకపోవడం..అమలు చేయకపోవడం ఆకునూరి మురళిని నొప్పించిందన్న టాక్ ఉంది. దీంతో పలుమార్లు బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

టీచర్లకు జీతాలు తగ్గించాలన్న సిఫార్సుపై తీవ్ర వ్యతిరేకత..

మీడియా ఇంటర్వ్యూల్లో సర్కార్‌పై విమర్శలు చేశారు. టీచర్లకు జీతాలెక్కువ ఉన్నాయని, తగ్గించాలని సిఫార్సు చేయడంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. టీచర్లను కాంట్రాక్ట్‌ పద్ధతిలో నియమించాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎత్తివేయాలని సూచించడం కూడా కాంట్రవర్సీ అయింది. ఈ మొత్తం వ్యవహారంలో కే. కేశవరావు కల్పించుకొని టీచర్ల జీతాలను తగ్గించబోమని ప్రకటన చేయాల్సి వచ్చింది. ఇక ఇంటర్‌ బోర్డును పాఠశాల విద్యలో విలీనం అంటూ సర్కార్ వెనక్కి తగ్గడం..విద్యా కమిషన్‌ సిఫార్సులపై గుసగుసలకు దారితీసింది.

ఆకునూరి నేతృత్వంలో విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసిన సర్కార్‌ తర్వాత..తెలంగాణ ఎడ్యుకేషన్‌ పాలసీ రూపకల్పనకు ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు నేతృత్వంలో మరో కమిటీ వేసింది. ఈ కమిటీలో ఆకునూరి మురళిని సభ్యుడిగా నియమించింది. దీంతో ఒక రకంగా విద్యా కమిషన్‌ను బైపాస్‌ చేసినట్లు అయిందని కూడా ఫీలయ్యారట. కేశవరావు కమిటీ నియామకంతో ఆకునూరి ఛైర్మన్‌గా ఉన్న విద్యా కమిషన్‌కు ప్రాధాన్యత తగ్గిపోయిందని కూడా భావించి ఉండొచ్చంటున్నారు. అయితే తన రాజీనామాకు కారణమేంటో ఆకునూరి మురళి..స్పందిస్తే తప్ప క్లారిటీ వచ్చే పరిస్థితి లేదు.