Cm Revanth Reddy: ఒక దెబ్బకు రెండు పిట్టలు..! కాళేశ్వరం సెంట్రిక్‌గా సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్..!

అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్ స్కీమ్‌గా ఉన్న కాళేశ్వరం సెంట్రిక్‌గా రేవంత్‌ ఆడుతున్న మ్యూజికల్ ఛైర్ గేమ్‌..తెలంగాణలో హాట్‌ టాపిక్‌గా మారింది.

  • Updated on- April 28, 2026 / 08:09 PM IST
  • బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని ఎక్స్‌పోజ్‌ చేసే స్కెచ్
  • క‌మిష‌న్ రిపోర్ట్‌ను హైకోర్టు నిలిపివేయడంతో ప్లాన్ చేంజ్
  • త్వర‌లో సీబీఐ డైరెక్టర్‌ను క‌లవ‌నున్న సీఎం రేవంత్
  • అవ‌స‌ర‌మైతే సుప్రీంకోర్టుకు వెళ్లే యోచ‌న‌లో స‌ర్కార్

 

Cm Revanth Reddy: కాళేశ్వరమే అతిపెద్ద వెపన్. బీఆర్ఎస్, బీజేపీనే టార్గెట్. సీబీఐ దర్యాప్తు కోసమే పట్టు. సీఎం రేవంత్‌ పొలిటికల్ స్ట్రాటజీ ఈ లైన్‌ చుట్టే నడుస్తోందట. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌ను హైకోర్టు పిలిపివేయడంతో..ఆ రెండు పార్టీలను ఇరికించేందుకు రేవంత్‌ మళ్లీ సీబీఐ విచారణ అంటూ చర్చకు తెరలేపుతున్నారట. ఏకంగా సీబీఐ డైరెక్టర్‌ను కలిసి.. కాళేశ్వరంపై దర్యాప్తు కోసం రిక్వెస్ట్ చేయనున్నారట. కాళేశ్వరమే రేవంత్‌కు పొలిటికల్ మైలేజ్ టాపిక్ అయిపోయిందా? లిఫ్ట్ ఇరిగేషన్‌ చుట్టూ సీబీఐ లింకు పెట్టడం వెనుక రేవంత్ వ్యూహం ఏంటి?

తెలంగాణ పాలిటిక్స్‌లో కాళేశ్వరం ప్రకంప‌నలు ఇప్పట్లో ఆగేలా లేవు. ఆరని దీపంలా..కార్తీక దీపం సీరియల్‌ ఎపిసోడ్‌లా..కాళేశ్వరం ఎపిసోడ్‌ను ఎప్పటికప్పుడు సరికొత్తగా ట్విస్ట్ చేసి..బీఆర్ఎస్, బీజేపీ టార్గెట్‌గా రచ్చకు తెరలేపుతున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. లేటెస్ట్‌గా కాళేశ్వరం క‌మిష‌న్ రిపోర్ట్‌ను హైకోర్టు నిలిపివేయడంతో..ప్లాన్‌ మార్చేశారట ముఖ్యమంత్రి. ఇప్పటికే సీబీఐ దర్యాప్తు కోసం కేంద్రానికి రెండుసార్లు లేఖ రాశారు. 9 నెలలు అయినా కాళేశ్వరంపై సీబీఐ విచారణకు కేంద్ర ప్రభుత్వంలో కదలిక లేదని అంటోంది కాంగ్రెస్. దీంతో ఇప్పుడు మరోసారి వ్యూహాత్మకంగా సీబీఐ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. త్వరలోనే సీబీఐ డైరెక్టర్‌ను కలిసేందుకు సిద్ధమవుతున్నారట. కాళేశ్వరం రీడిజైనింగ్ పేరుతో వేల కోట్ల అవినీతి జరిగిందని, దీనిపై విచారణ జరిపించాలని రిక్వెస్ట్ చేయనున్నారట సీఎం రేవంత్.

బీఆర్ఎస్..బీజేపీ ఒక్కటేనని ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహం

రేవంత్ రెడ్డి..సీబీఐ అస్త్రాన్ని ప్రయోగించ‌డం వెనుక‌..ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీల‌ను ఏకకాలంలో డిఫెన్స్‌లోకి నెట్టాల‌న్నదే మెయిన్ స్కెచ్ అంటున్నారు. ఒకవేళ కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశించకపోతే..రాజ‌కీయంగా రేవంత్‌కు వ‌రంగా మార‌నుందన్న టాక్ నడుస్తోంది. బీఆర్ఎస్-బీజేపీ ఒక్కటే..అన్న ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళొచ్చన్నది రేవంత్ రెడ్డి ప్లాన్‌గా చెబుతున్నారు. ఇప్పటికే ఢిల్లీలో దోస్తీ-గల్లీలో కుస్తీ అంటూ..ఎప్పటికప్పుడు ఆ రెండు పార్టీల‌పై విమర్శలు చేస్తున్న సీఎం రేవంత్.. సీబీఐ విచారణకు పట్టుబడుతూ బీజేపీకి అగ్నిపరీక్ష పెడుతున్నారట.

సీబీఐ విచారణ జరిగితే బీఆర్ఎస్‌ ఉక్కిరిబిక్కిరి..

రేవంత్ ఒత్తిడితో..సీబీఐ విచారణ చేస్తే..బీఆర్ఎస్‌ను ఉక్కిరిబిక్కిరి చేయొచ్చు. ఒకవేళ‌ సీబీఐ దర్యాప్తునకు ఆదేశించకపోతే బీజేపీకి..కేసీఆర్ సీక్రెట్ ఫ్రెండ్‌ అని ఎక్స్‌పోజ్ చేయొచ్చనేది రేవంత్ పొలిటిక‌ల్ ఫార్ములాగా చర్చించుకుంటున్నారు. సీబీఐ విచారణకు ఆదేశించే విషయంలో కేంద్రం నుంచి ఆశించిన స్పందన లేకపోతే..అవ‌స‌ర‌మైతే..సుప్రీంకోర్టు గడప తొక్కేందుకు కూడా రెడీ అవుతోందట రేవంత్ స‌ర్కార్. సీబీఐ విచారణ కోరుతూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ వేసి..జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా చేయాలన్న ఆలోచన కూడా చేస్తున్నారట.

ఓవైపు కాళేశ్వరం రిపేర్లు అంటూ హడావుడి చేస్తున్నారు. ఆల్రెడీ మరమ్మత్తుల కోసం కమిటీని కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు సీబీఐ దర్యాప్తు చేయాలని పట్టుబడుతున్నారు. ఇలా కాళేశ్వరం చుట్టూ మల్టిపుల్‌ డెసిషన్స్..డ్యుయల్ రోల్స్‌..పొలిటికల్ ఇంట్రెస్టింగ్‌గా మారాయి. అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్ స్కీమ్‌గా ఉన్న కాళేశ్వరం సెంట్రిక్‌గా రేవంత్‌ ఆడుతున్న మ్యూజికల్ ఛైర్ గేమ్‌..తెలంగాణలో హాట్‌ టాపిక్‌గా మారింది. సీబీఐ ఎంట్రీ ఇస్తే కేసీఆర్ అండ్ టీమ్‌కు కష్టాలు. కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశించకపోతే..ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు..అది కాంగ్రెస్‌కు రాజకీయంగా వరం.! రెండింటిలో ఏది జ‌రిగినా..తనకే ప్లస్‌ పాయింటనేది రేవంత్‌ అంచనాగా చెబుతున్నారు. కాళేశ్వరం సెంట్రిక్‌గా..అయితే బీఆర్ఎస్‌..లేకపోతే బీఆర్ఎస్‌తో పాటు బీజేపీని కార్నర్‌ చేయాలనుకుంటున్న రేవంత్‌ రాజకీయ ఎత్తులు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.

Also Read: పెట్రోల్ రేట్లు పెరగవు.. తేల్చి చెప్పిన కేంద్రం..