Rajya Sabha Elections Representative Image (Image Credit To Original Source)
Rajya Sabha Elections: రెండు సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఒక్కటి కాంగ్రెస్కు దక్కడం పక్కా. ఇంకో సీటు హస్తం ఖాతాలో పడాలంటే జంపింగ్ ఎమ్మెల్యేలు, ఎంఐఎం సపోర్ట్ ఉండాల్సిందే. అయితే ఆ రెండు సీట్లను దక్కించుకునేందుకు కాంగ్రెస్ పెద్దలు ఇప్పటినుంచే పావులు కదపడం స్టార్ట్ చేశారు. ఒక సీటును సునాయసంగా గెలిచే అవకాశం ఉన్నా..రెండో సీటు కోసం ఇప్పటినుంచే మంతనాలు స్టార్ట్ అయ్యాయట. సేమ్టైమ్ హస్తం గూటిలో రాజ్యసభ రేసు కూడా పెద్దగానే ఉందంటున్నారు. రేసులో ఉన్నదెవరు? కాంగ్రెస్ ఈక్వేషన్స్ ఏంటి?
రాజ్యసభ సీట్ల రేసు తెలంగాణ కాంగ్రెస్లో ఇంట్రెస్టింగ్గా మారింది. తెలంగాణలో రెండు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న కేఆర్ సురేష్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీల పదవీకాలం ఏప్రిల్ 9న ముగియనుంది. ఆలోపే ఆ రెండు స్థానాల్లో కొత్త సభ్యుల ఎన్నిక కోసం ఈసీ షెడ్యూల రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 26 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. మార్చి 16 పోలింగ్.. అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు.
రాజ్యసభ సభ్యుల ఎన్నికలో ఎమ్మెల్యేలకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. అసెంబ్లీలో పార్టీల బలాబలాలను బట్టి సీట్లు దక్కుతాయి. ఒక్క రాజ్యసభ సీటు గెలవాలంటే 40 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఖాళీ కాబోయే రెండు రాజ్యసభ స్థానాలు గెలుచుకోవాలంటే కాంగ్రెస్కు 80మంది ఎమ్మెల్యేల సపోర్ట్ కావాలి. ప్రస్తుతం ఉన్న బలం ప్రకారం కాంగ్రెస్ ఒక సీటును గెలుచుకోవడం ఈజీ. రెండో సీటు కోసం ఆ పార్టీకి పది జంపింగ్ ఎమ్మెల్యేలతో పాటు..ఎంఐఎం సపోర్ట్ తీసుకోక తప్పని పరిస్థితి.
జంపింగ్ ఎమ్మెల్యేలతో కలుపుకున్నా కాంగ్రెస్ బలం 76కు చేరుకుంటుంది. ఇంకా నలుగురు ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎలాగూ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేసే పరిస్థితి ఉండదు. ఎటొచ్చి కాంగ్రెస్కు మద్దతు తెలిపేది మిత్రపక్షం ఎంఐఎం మాత్రమే. ఆ పార్టీకి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి..వాళ్లు మద్దతిస్తే అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 83కు చేరుకుంటుంది. గూడెం మహిపాల్రెడ్డి బ్యాక్ టు పెవిలియన్ అని బీఆర్ఎస్లో లైన్లోకి వెళ్లారు.
అయినా 9మంది జంపింగ్ ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంఐఎం సభ్యులు, 66మంది తమ ఎమ్మెల్యేలతో కలిపి కాంగ్రెస్కు 82 మంది మద్దతు ఉంటుంది. దీంతో రెండు సీట్లను తమ ఖాతాలో వేసుకునేందుకు అటు జంపింగ్ ఎమ్మెల్యేలను లైన్లో పెట్టడంతో పాటు..ఎంఐఎం పెద్దలతో కూడా చర్చలు జరుపుతున్నారట హస్తం పార్టీ పెద్దలు. రాజ్యసభ ఎన్నికల్లో విప్ జారీ చేసే అవకాశం ఉండకపోగా..సీక్రెట్ ఓటింగ్ కావడంతో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ సీట్లు తమ ఖాతాలో పడటం ఖాయమన్న హోప్స్లో ఉన్నారట కాంగ్రెస్ లీడర్లు.
ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ సీట్లు కాంగ్రెస్కే దక్కనున్న నేపథ్యంలో పార్టీలో ఆశావహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం పదవీకాలం ముగుస్తున్న అభిషేక్ సింఘ్వీకి మరోసారి రెన్యూవల్ చేసే అవకాశం ఉందట. జాతీయ స్థాయిలో పార్టీ అవసరాల దృష్ట్యా అభిషేక్ సింఘ్వీ పేరు మరోసారి ప్రతిపాదించే అవకాశం ఉందంటున్నారు. ఇక ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి తరఫున పోటీ చేసిన తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరు కూడా బలంగా వినిపిస్తోంది. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినప్పుడే కాంగ్రెస్ అధిష్టానం సుదర్శన్ రెడ్డికి రాజ్యసభ హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.
వీరితో పాటు మరో నేత సీఎంకు అత్యంత సన్నిహితుడు, సీఎం రాజకీయ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పేరు కూడా పార్టీ నేతల్లో బలంగా వినిపిస్తోంది. గతంలో వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ చేసేందుకు ప్రయత్నం చేసినా సామాజిక సమీకరణాలు వర్కౌట్ కాలేదు. దీంతో వేంను రాజ్యసభకు పంపిస్తారని జోరుగా చర్చ జరుగుతోంది. అలాగే పార్టీలో సీనియర్ నేతలు వీహెచ్, ఈరవత్రి అనిల్ పేర్లు కూడా రేసులో వినిపిస్తున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి..తన మిత్రుడు జెట్టి కుసుమ కుమార్ కోసం ఢిల్లీ వెళ్లారు.
ఇలా రెండు స్థానాల కోసం అధికార కాంగ్రెస్లో డజను మంది పేర్లు చర్చలో ఉన్నాయి. ఛాన్స్ కోసం నేతలు తమకున్న పరిచయాల ద్వారా ఢిల్లీ పెద్దల దగ్గర లాబీయింగ్ చేస్తున్నారట. అధిష్టానం మాత్రం జాతీయ స్థాయిలో పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాజ్యసభ సీట్లను భర్తీ చేసే అవకాశాలున్నాయట. తెలంగాణ కోటాలో పెద్దల సభలో అడుగు పెట్టే లక్కీ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలి.