బీఆర్‌ఎస్‌ బాస్‌ కేసీఆర్‌ దర్శనం ఎప్పుడు? ఎందుకు ప్రజల్లోకి రాలేకపోతున్నారు?

కేసీఆర్‌ మళ్లీ యాక్టివ్‌గా తిరగాలని... తన వాగ్ధాటిని ప్రదర్శించాలని కోరుకుంటున్నాయి. మరి కార్యకర్తల కోరికను కేసీఆర్‌ ఎంతవరకు నెరవేరుస్తారో చూడాలి..

Gossip Garage : బీఆర్‌ఎస్‌ బాస్‌ కేసీఆర్‌ దర్శన భాగ్యం ఎప్పుడు…? పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో బయటకు వచ్చిన గులాబీ దళపతి.. మళ్లీ జనం ముందుకు రావడానికి ఇష్టపడటం లేదా? ఇదిగో అదిగో అంటూ చెబుతున్న తేదీలు మారుతున్నాయే గానీ, ఎర్రవెళ్లి నుంచి బయటకి రావడం లేదు మాజీ సీఎం కేసీఆర్‌… అప్పుడు ఇప్పుడు అంటూ ఇన్నాళ్లు నెట్టుకొచ్చిన బీఆర్‌ఎస్‌ క్యాడర్‌… కేసీఆర్‌ ఆగమనంపై కొత్త కారణాలు వెతుక్కునే పనిలో పడిందనే టాక్‌ పొలిటికల్‌ సర్కిల్స్‌లో సరికొత్త చర్చకు తెరలేపింది….

అన్నీ సర్దుకున్న తర్వాత కేసీఆర్‌ వస్తారని ఎదురుచూసినా..
ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎర్రవెల్లిలోని తన ఫాం హౌస్‌కే పరిమితమైన బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ జనంబాట పట్టేదెప్పుడని ఇంటా బయటా చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో షాక్‌ తిన్న మాజీ సీఎం.. ఆ తర్వాత కొద్ది రోజులకు కోలుకుని పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చినా…. ఆ ఎన్నికల్లోనూ ఓటర్లు రౌండప్‌ చేయడంతో కోలుకోలేని దెబ్బ తిన్నారు. ఇక అదే సమయంలో తన కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో అరెస్టు అయి జైలుకు వెళ్లడంతోపాటు ఇతర కారణాల వల్ల బయటకు రాలేకపోయారు కేసీఆర్‌. ఇక ఇప్పుడు అన్నీ సర్దుకున్న తర్వాత కేసీఆర్‌ వస్తారని పార్టీ కార్యకర్తలు ఎదురుచూడటమే కానీ, అధినేత దర్శనం మాత్రం దక్కడం లేదంటున్నారు.

యాగం ముగిశాక ప్రజల్లోకి వస్తారని చెప్పారు.. కానీ,
అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 10 నెలలు కావస్తుండటం… కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఇచ్చిన హానీమూన్‌ పిరియడ్‌ కూడా ముగియడంతో కేసీఆర్‌ ప్రజాక్షేత్రంలో రావాలని డిమాండ్‌ వినిపిస్తోంది. ఐతే ఇన్నాళ్లు తగిన సమయం కోసం ఎదురుచూసిన కేసీఆర్‌… రైతు రుణమాఫీని ప్రభుత్వం సక్రమంగా అమలు చేయలేదన్న సాకు చూపి రైతు యాత్ర చేస్తారని చెప్పింది బీఆర్ఎస్‌ పార్టీ. దీంతో ఇటు బీఆర్‌ఎస్‌ క్యాడర్‌తోపాటు అటు రైతులు కూడా కేసీఆర్‌ రంగంలోకి దిగితే ప్రభుత్వంలో చలనం వస్తుందని ఆశిస్తున్నారు. కానీ కేసీఆర్‌ మాత్రం ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూ వస్తున్నారు. ఇక ఈ నెలారంభంలో రెండు రోజుల హోమం నిర్వహించిన కేసీఆర్‌.. యాగం ముగిశాక ప్రజల్లోకి వస్తారని చెప్పారు. కానీ, ఆ సమయమూ ముగిసిపోయింది. దీంతో కేసీఆర్‌ ఎప్పుడొస్తారంటూ అంతా ఎదురుచూస్తున్నారు.

కేసీఆర్ తీరుపై కార్యకర్తల్లో చర్చ…
బీఆర్‌ఎస్‌ పార్టీని అన్నీతానై నడిపించిన మాజీ సీఎం కేసీఆర్‌… ఇలా కుదేలైపోవడం కార్యకర్తల్లో చర్చకు దారితీస్తోంది. ఎర్రవెల్లి ఫాం హౌస్‌లో ప్రతి రోజూ కార్యకర్తలను కలుస్తున్న కేసీఆర్… హైదరాబాద్‌లో పార్టీ కార్యాలయానికి వారంలో ఒకసారైనా వచ్చిపోతే బాగుణ్ణు కదా? అని కోరుకుంటున్నారు కార్యకర్తలు. ప్రస్తుతం కేసీఆర్‌ దూరంగా ఉండటంతో పార్టీ విధాన నిర్ణయాల అమలు బాధ్యత మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ చూస్తున్నారు. ఈ ఇద్దరూ కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దాటిని సమర్థంగా ఎదుర్కొనడంపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీరికి తోడుగా కేసీఆర్‌ కూడా కనిపిస్తే పార్టీకి బూస్ట్‌ వస్తుందనే అభిప్రాయం ఉంది. కానీ, ఎందుకనో కేసీఆర్‌ దూరంగా ఉంటుండటం వల్ల హరీశ్‌ రావు, కేటీఆర్‌ పోరాటానికి సమగ్రత రావడం లేదంటున్నారు.

Also Read : కాంగ్రెస్‍లో హాట్ టాపిక్‌గా మారిన కొత్త రూల్..! ఇంతకీ పీసీసీ చీఫ్ ప్లాన్ ఏంటి?

కేసీఆర్‌ మళ్లీ యాక్టివ్‌గా తిరగాలని కార్యకర్తల కోరిక..
కేసీఆర్‌ ఎక్కువగా ఫాం హౌస్‌కే పరిమితమవడంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా పదే పదే రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని బీఆర్‌ఎస్‌ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. కేసీఆర్‌ను బయటకు రమ్మన్నా రావడం లేదని ఎత్తిచూపుతూ బీఆర్‌ఎస్‌పై రాజకీయంగా పైచేయి సాధించేందుకు సీఎం ఓ పథకం ప్రకారం పావులు కదుపుతున్నారు. సీఎం వ్యూహాలను గమనిస్తున్నారో లేదో కానీ, కేసీఆర్‌ మాత్రం… సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ మంత్రుల వ్యాఖ్యలపై అసలు స్పందించడం లేదు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి సైతం రావడానికి ఇష్టపడటం లేదు. ఈ పది నెలల కాలంలో కేవలం రెండు సార్లు అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్‌… ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. దీంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు డీలా పడుతున్నాయి. కేసీఆర్‌ మళ్లీ యాక్టివ్‌గా తిరగాలని… తన వాగ్ధాటిని ప్రదర్శించాలని కోరుకుంటున్నాయి. మరి కార్యకర్తల కోరికను కేసీఆర్‌ ఎంతవరకు నెరవేరుస్తారో చూడాల్సివుంది.