Governor Tamilisai criticized TS govt : తెలంగాణ సర్కార్ పై గవర్నర్ తమిళిసై మరోసారి పరోక్షంగా ఫైర్ అయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో సర్కార్ పై ఆమె విమర్శలు చేశారు. రాష్ట్రంలో అత్యున్నత హోదాలో ఉన్న మహిళ పట్ల కూడా అవమానకరంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై వివక్ష చూపిస్తున్నారని, చాలా హాస్యాస్పదంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మహిళపై రాళ్లు విసిరిన వ్యక్తులకే పూల దండలు వేస్తున్నారని పేర్కొన్నారు.
అలాంటి వారిని సన్మానిస్తూ తెలంగాణ ప్రజలకు ఎలాంటి సందేశాన్నిస్తున్నారని నిలదీశారు. ఇది చాలా దురదృష్టకర పరిణామమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తనకు మాత్రమే జరిగిన అవమానం కాదని.. మొత్తం మహిళలకు జరిగిన అవమానం అని ఆమె వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ ప్రభుత్వానికి చురకలంటించారు.
సంస్కృతి, సంప్రదాయాలున్న తెలంగాణలో తన పట్లే కాదు.. ఏ మహిళ పట్ల అవమానకరంగా మాట్లాడినా సహించేది లేదన్నారు. తన విజ్ఞప్తి ఒక్కటేనని.. మహిళలను గౌరవించండి అని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో హుందాగా వ్యవహరించండని కోరారు. మహిళలను అదేపనిగా తూల నాడొద్దని హితవు పలికారు. తెలంగాణలో ఆత్మహత్యలు అధికంగా జరుగుతున్నాయని, ప్రతిభావంతులైన పీజీ వైద్య విద్యార్థిని రక్షించుకోలేకపోవడం చాలా బాధగా ఉందని ఆవేదన వెలిబుచ్చారు.
ఇది రుద్రమదేవి పుట్టిన నేలని.. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు. ఒక మహిళకు అన్యాయం జరిగితే తాను వెంట నడుస్తానని, తనకు జరిగితే మీరంతా వెంట ఉంటారని బలంగా విశ్వసిస్తున్నానని, మరింత ధృడంగా మారుతానని గవర్నర్ చెప్పారు. గుర్తింపుకు నోచుకోని ప్రతిభావంతులను గుర్తించడమే రాజ్ భవన్ ప్రధాన విధి అని చెప్పారు.
రాజకీయంగా సిద్ధాంతాలు, ఆలోచనలు వేరుగా ఉండొచ్చు కానీ, సందర్భం వచ్చినప్పుడు కలిసి పోవాల్సిన అవసరం ఉందన్నారు. తనకు వ్యక్తిగత లక్ష్యాలు లేవని.. గవర్నర్ పరిధి లోబడే పని చేస్తున్నట్లు గవర్నర్ తమిళిసై చెప్పారు. తనపై ఎన్ని విమర్శలు చేసినా, వివక్ష చూపినా వెనక్కి తగ్గబోనని తేల్చి చెప్పారు. ఎవరెన్ని మాటలన్నా పట్టించుకోబోనన్నారు. ఓ సోదరిలా ప్రజలకు సేవ చేస్తానని స్పష్టం చేశారు.