Graduate MLC election campaign : తెలంగాణలో సార్వత్రికాన్ని మించి జరుగుతున్న పట్టభద్రుల ప్రచారం నేటితో ముగియనుంది. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు మునిగిపోయారు. అయితే, ఫేక్ ఓట్లు ఇప్పుడు సమస్యగా మారాయి. వాటిని అధిగమించేందుకు అధికారులు చేస్తున్న కసరత్తు ఏంటి? మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 93 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. అత్యధికంగా అభ్యుర్థులుండటంతో.. జెంబో బ్యాలెట్ పేపర్తో అధికారులు బ్యాలెట్ బాక్స్ను సిద్ధం చేశారు. ఎన్నికల నిర్వహణకు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
మూడు ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ.. కొత్తగా ఏర్పాటైన జిల్లాల పద్ధతిలోనే ఎన్నికల నిర్వాహణ చేస్తున్నారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణ పేట, రంగారెడ్డి, వికారా బాద్, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాల అధికారులు ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. తొమ్మిది జిల్లాల్లో మొత్తం 5లక్షల 36వేల 268 ఓటర్లున్నారు. అత్యధికంగా రంగారెడ్డిలో లక్షా 44వేల 416 మంది ఓటర్లుండగా.. నారాయణ పేట్ జిల్లాలో 13వేల 899మంది ఓటర్లున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 799 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహబూబ్ నగర్లో 56, నాగర్ కర్నూల్లో 44, వనపర్తిలో 31, జోగులాంబ గద్వాల్లో 22, నారాయణ్ పెట్లో 20, రంగారెడ్డి జిల్లాలో 199, వికారాబాద్లో 38, మేడ్చల్ మల్కాజిగిరిలో 198, హైదరాబాద్లో 191 పోలింగ్ కేంద్రాలున్నాయి. ప్రతీ పోలింగ్ కేంద్రానికి రెండు బాక్సుల చొప్పున 15వందల బ్యాలెట్ బాక్స్లను సిద్ధం చేశారు. ఇప్పటికే సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరించారు. ఎన్నికల కోసం మొత్తం 3వేల 835 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. వారిలో 959 మంది పీఓలు ఉండగా.. 2వేల 876మంది ఓపీఓలు ఉన్నారు.
ఓ వైపు ఎన్నికల కోసం అధికారులు కసరత్తు చేస్తుంటే.. మరోవైపు బోగస్ ఓట్లపై అభ్యర్ధులు ఆరోపణలు చేస్తున్నారు. సికింద్రాబాద్ తార్నాకలో ఒకే ఇంటికి 25 ఓట్లు ఉండగా.. కనీసం వారి ఫొటోలు లేకపోవడం సంచలనంగా మారింది. వాటిని మోసపూరిత ఓట్లుగా చేర్చాలని అభ్యర్ధులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. కరోనా కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 80 ఏళ్లు పైబడిన అభ్యర్ధులు, కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించనుంది.