Heavy Rains In Telangana : తెలంగాణలో రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 7 నుంచి 10వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. వాతావరణ కేంద్రం పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్లను జారీ చేసింది. బుధ, శనివారం రోజుల్లో ఎల్లో అలెర్ట్, గురు, శుక్రవారాల్లో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. గురువారం రోజు హైదరాబాద్కు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచికొట్టింది. మంగళవారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండగా.. మధ్యాహ్నానికి కుండపోత వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సనత్నగర్లోలో మోకాళ్లలోతు మేర నీరు నిలిచిపోయింది. దీంతో రవాణా స్తంభించింపోయింది. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలమయం
అయ్యాయి.
శేరిలింగంపల్లి, చందానగర్, గచ్చిబౌలి, మియపూర్, జూబ్లీహిల్స్, అమీర్ పేట, ఎస్సార్ నగర్ ప్రాంతాలలో కుండపోత వర్షం కురుస్తోంది. కూకట్ పల్లి, కాప్ర, ఖైరతాబాద్, కంటోన్మెంట్, మల్కాజ్ గిరి, ఎల్బీ నగర్, శేరిలింగంపల్లి, రాజేంద్ర నగర్, ముషీరాబాద్, అంబర్ పేట, ఉప్పల్, చార్మినార్, అల్వాల్ ప్రాంతాల్లోనూ ఓ మోస్తరుగా వానలు పడుతున్నాయి.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ.. హైదరాబాద్ వాతావరణ శాఖ ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మంగళవారం నాగర్కర్నూల్ జిల్లాలో అత్యధికంగా 70.6 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, మహబూబ్నగర్ జిల్లాలో 60.4 మి.మీ., జోగులాంబ గద్వాల జిల్లాలో 51.6 మి.మీ., మంచిర్యాల జిల్లాలో 45.2 మి.మీ., పెద్దపల్లిలో 42 మి.మీ. వర్షపాతం నమోదైంది.