Telangana Congress: కమ్యూనిస్టులకు కాంగ్రెస్ ఎన్ని స్థానాలు కేటాయిస్తుంది?
తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీలతో ఎన్నికలకు వెళ్తే తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తమకు లాభం చేకూరుతుందని అంచనా వేస్తుంది.
- Naga Srinivasa Rao Poduri
- Published On : September 7, 2023 / 07:53 PM IST
how many seats give congress to left parties if alliance confirmed
Telangana Congress- Left Parties: తెలంగాణ పాలిటిక్స్ (Telangana Politics) కొత్త రూపం సంతరించుకోబోతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కొత్త పొత్తు పొడుస్తోంది. కమ్యూనిస్టులతో కాంగ్రెస్ జట్టుకట్టేందుకు సై అంటోంది. జాతీయస్థాయిలో విపక్ష కూటమి ఇండియా(I.N.D.I.A) పేరుతో ఇప్పటికే ఒకే ప్లాట్ ఫామ్పై ఉన్న పార్టీలు.. తెలంగాణలో కూడా ఒకే గొడుగు కిందకు రావాలని చూస్తున్నాయి. ఇప్పటికే ఒక దఫా చర్చలు పూర్తి కాగా.. ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్తో (KC Venugopal) సీపీఐ నేత నారాయణ (CPI Narayana) భేటీ కావడం పొత్తు ఖాయమనే సంకేతాలు ఇచ్చినట్టు అయింది. ఇంతకీ పొత్తు సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి? కమ్యూనిస్టులకు కాంగ్రెస్ ఎన్ని స్థానాలు కేటాయించాలనుకుంటోంది?
గులాబీ బాస్ కటీఫ్ చెప్పడంతో ఎర్రజెండాలను తన వైపు తిప్పుకుంటోంది గాంధీభవన్. ఫస్ట్ లిస్ట్ ప్రకటనతో పాటే సింగిల్గానే ఎన్నికల బరిలోకి దిగుతామంటూ తేల్చిచెప్పారు కేసీఆర్. దీంతో అప్పటివరకు కారుతో పాటు నడుస్తామనుకున్న కామ్రేడ్స్ షాక్ అయ్యారు. హుటాహుటిన మీటింగ్లు.. కొత్త పొత్తుల చర్చలు జరిపారు. ఇది గమనించిన కాంగ్రెస్.. లెఫ్ట్ పార్టీలకు స్నేహ హస్తం చాస్తోంది.
కాంగ్రెస్తో కామ్రేడ్స్ దోస్తీకి ముందడుగులు వేగంగా పడుతున్నాయి. సీపీఐ నేతలు టీ కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్రావ్ ఠాక్రేతో చర్చలు జరపగా.. AICC సమావేశాల ఏర్పాట్ల పరిశీలన కోసం వచ్చిన కేసీ వేణుగోపాల్ కూడా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణతో చర్చలు జరిపారు. సీపీఐకి నాలుగు సీట్లు కావాలని ప్రతిపాదన పెట్టగా.. కేసీ ఒక్క సీటు ఇచ్చేందుకు సిద్దమని చెప్పినట్లుగా సమాచారం.
ఖమ్మంలో తమకు సీట్లు ఇవ్వాలని నారాయణ కోరగా ఖమ్మంలో జనరల్ స్థానాలు ఇచ్చే పరిస్థితి లేదని, రిజర్వుడ్ సీట్లలో ఒకటి ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పినట్లు సమాచారం. అయితే ఇదే ప్రతిపాదనను సీపీఎంకు కూడా పంపించాలని కేసీ వేణుగోపాల్.. నారాయణకు సూచించారని తెలుస్తోంది. సీపీఐ, సీపీఎంలకు చెరో టిక్కెట్ విషయంలో తమకు అభ్యంతరం లేదని, పొత్తుకు సిద్దమనే సంకేతాలు పంపించారు. అయితే మరోసారి సొంత పార్టీతో పాటు అటు సీపీఎంతో చర్చలు జరిపి తమ నిర్ణయాన్ని తెలియజేస్తామని నారాయణ చెప్పినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునేందుకు నారాయణ పూర్తి సంసిద్ధత వ్యక్తం చేశారు.
Also Read: కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన వాయిదా.. కారణమేంటి?
తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీలతో ఎన్నికలకు వెళ్తే తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తమకు లాభం చేకూరుతుందని అంచనా వేస్తుంది. కమ్యూనిస్టులతో కలిసి వెళ్తే దాదాపు 30 నుంచి 35 నియోజకవర్గాల్లో లాభం జరుగుతుందని లెక్కలు కడుతుంది. జాతీయ స్థాయిలో విపక్ష కూటమిలో ఇప్పటికే షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న కాంగ్రెస్, కమ్యూనిస్టు నేతలు.. రాష్ట్రంలోనూ కలిస్తే మంచి ఇండికేషన్ ఇచ్చినట్టుగా అవుతుందని భావిస్తున్నారు. అటు కేంద్రంలో బీజేపీని, ఇటు రాష్ట్రంలో బీఆర్ఎస్పై తమ గళాన్ని వినిపించే బలం మరింత పెరుగుతుందని అనుకుంటున్నారు. అందుకే సీపీఐ, సీపీఎంలకు చెరో టికెట్ ఇస్తామని ప్రతిపాదన ముందు పెట్టి.. అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారని తెలుస్తోంది.
Also Read: కాంగ్రెస్లో భారీ చేరికల ప్లాన్.. ఇంతకీ చేరుతున్నది ఎవరెవరు? ముహూర్తం ఎప్పుడు?
ఈ మొత్తం పొత్తు చర్చలో ట్విస్ట్ పాయింట్ ఏంటంటే.. కమ్యూనిస్టులు కోరిన చోట కాకుండా వేరేచోట కేటాయిస్తామని కాంగ్రెస్ తేల్చి చెప్పేసిందని సమాచారం. దీనిపైనే కామ్రేడ్స్ తర్జనభర్జన పడుతున్నారని.. అంతర్గత చర్చల ద్వారా తమ స్టాండ్ తేలియచేయాలని భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రతిపాదనకు కమ్యూనిస్టులు ఒప్పుకుంటారా? లేదంటే కామ్రేడ్స్ కోసం హస్తం నేతలు కాస్త మెత్తబడతారా? చూడాల్సి ఉంది. మొత్తంగా ఈ పొత్తు ఏ వైపు వాలుతుందనేది ఆసక్తికరంగా మారింది.
