Rajiv Yuva Vikasam
Rajiv Yuva Vikasam Scheme : తెలంగాణ యువతకు గుడ్ న్యూస్.. రాజీవ్ యువ వికాసం స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ పథకం కింద స్వయం ఉపాధి రుణాలను మంజూరు చేసే నిబంధనలకు సంబంధించి నిర్ణయం తీసుకుంది.
ఈబీసీ నిరుద్యోగుల కోసం యూనిట్లను 4 కేటగిరీలుగా విభజించింది. అంతేకాదు.. ఈ పథకం కింద అందించే రుణాలపై కూడా సబ్సిడీ ఫండ్స్ వాటాను భారీగా పెంచేసింది. గతంలో స్వయం ఉపాధి పథకాలకు మించి కొత్త నిబంధనలను ప్రభుత్వం రూపొందిస్తోంది.
ఇప్పటికే, రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క దీనిపై సంక్షేమశాఖ సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రధానంగా యూనిట్ల ఖర్చుతో పాటు సబ్సిడీ వాటాను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది.
24న కొత్త నిబంధనలు అమలు :
అంతేకాదు. అదేవిధంగా, రాజీవ్ యువవికాసం పథకం కింద ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు(EBC)కు త్వరలో యూనిట్లు మంజూరు చేయనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈబీసీ నిరుద్యోగుల కోసం ఆదివారం (మార్చి 23) నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్టు తెలిసింది. ఈ పథకానికి సంబంధించి కొత్త నిబంధనలు మార్చి 24న జారీ అయ్యే అవకాశం ఉంది.
చిరు వ్యాపారాల కోసం ప్రత్యేకించి రూ.50వేల రుణ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ పథకం కింద లబ్ధిదారులకు 100 శాతం సబ్సిడీతో రుణాలను అందించనుంది. అంతేకాదు.. రూ.లక్షలోపు యూనిట్లకు 90 శాతం సబ్సిడీని అందించనుంది.
గతంలో ఈ సబ్సిడీ 80శాతంగా ఉండేది. రూ.లక్షలోపు యూనిట్కు లబ్ధిదారులు కేవలం రూ.10వేలు మాత్రమే చెల్లించాలి. రూ.1 లక్షనుంచి రూ. 2 లక్షల్లోపు ఖరీదైన యూనిట్లకు సబ్సిడీని 80 శాతానికి ప్రభుత్వం పెంచింది. రూ.2 లక్షల నుంచి రూ. 4 లక్షల యూనిట్లకు సబ్సిడీని 70శాతంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
రాష్ట్రంలోని 5 లక్షల మంది యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అర్హులైన యువతకు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఆర్థిక సాయం అందనుంది. ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి మార్చి 17న ప్రారంభించారు. అయితే, అర్హులైన యువకులు ఏప్రిల్ 5వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.