Indiramma Illu: ఇందిరమ్మ ఇంటికోసం అప్లయ్ చేశారా..? ఫైనల్ లిస్ట్ ఎప్పుడు.. ఎలా చెక్చేసుకోవాలంటే..
తెలంగాణ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు పథకాలను ప్రారంభించనుంది. ఇందులో ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా ఒకటి. అయితే, ఈ పథకంకు దరఖాస్తు చేసుకున్న వారు..
- Harishth Thanniru
- Published On : January 26, 2025 / 07:09 AM IST
Indiramma House Scheme
Indiramma Illu: తెలంగాణ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు పథకాలను ప్రారంభించనుంది. ఇందులో రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల మంజూరు వంటి ప్రతిష్టాత్మక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టనుంది. వీటిలో పేద, మధ్య తరగతి ప్రజలు అధికశాతం మంది ఎదురు చూస్తున్నది ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసమే. ఈ పథకం కోసం ఇప్పటికే అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఇటీవల గ్రామ సభలు ఏర్పాటుచేసి దరఖాస్తులు అందజేసిన వారిలో అర్హత కలిగిన వారి జాబితాలను సిద్ధం చేశారు. అయితే, దరఖాస్తులు చేసుకొనేవారు ఇంకా అనేక మంది మంది ఉండటంతో వారికి కూడా అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Also Read: Retirement age: ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ పెంచడం ఖాయమా? నిరుద్యోగులకు మళ్లీ నిరాశ తప్పదా?
వాస్తవానికి ఇవాళ (జనవరి 26న) రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ లబ్ధిదారుల ఫైనల్ లిస్ట్ ను ప్రకటించాల్సి ఉంది. దరఖాస్తు చేసుకోవాల్సిన వారు ఇంకా ఉండటంతో ఫిబ్రవరి మొదటివారంలో లబ్ధిదారుల తుది జాబితాను ప్రభుత్వం ప్రకటించనుంది. ఈ ప్రక్రియ మార్చి నెల చివరి వరకు సాగుతుంది. ఇదిలాఉంటే.. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ఠంగా 4.50 లక్షల ఇళ్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి లబ్ధిదారునికి ప్రభుత్వం రూ.5లక్షలు ఇవ్వనుంది. మొదటి విడతలో స్థలం ఉన్నవారికి ఇళ్లు మంజూరు చేయనున్నారు. ఎంపికైన లబ్ధిదారులకు దశల వారీగా ఇంటి నిర్మాణానికి డబ్బులు మంజూరు చేస్తారు. మొదటగా బేస్మెంట్ స్థాయిలో రూ. లక్ష, స్లాబ్ నిర్మాణం జరిగే సమయంలో రూ.లక్ష, స్లాబ్ పూర్తయిన తరువాత రూ. రెండు లక్షలు, ఇంటి నిర్మాణం పూర్తయ్యాక మరో రూ.లక్ష అందిస్తారు. ఈ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేస్తారు.
Also Read: Padma Awards: పద్మ అవార్డులకు మీ పేరును మీరు ఎలా నామినేట్ చేసుకోవచ్చంటే..?
తెలంగాణ ప్రభుత్వం అర్హత కలిగిన వారు మరో నాలుగు రోజులు దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించింది. వచ్చే నెల ప్రారంభం నుంచి వచ్చిన దరఖాస్తులన్నింటిలో పథకానికి అర్హత ఉన్నవారిని ఎంపిక చేస్తారు. ఫిబ్రవరి మొదటి వారంలోనే మండలాల వారిగా ఈ పథకం కింద తొలి దశలో ఎంపికైన వారి జాబితాను ప్రకటిస్తారు.
దరఖాస్తు చేసుకోవాల్సింది వీరే..
♦ లబ్ధిదారుడు దారిద్ర్యరేఖ (బీపీఎల్)కు దిగువన ఉన్నవారై ఉండాలి.
♦ రేషన్ కార్డు ఆధారంగా లబ్ధిదారుడిని ఎంపిక చేస్తారు.
♦ లబ్ధిదారుడికి సొంతంగా ఖాళీ స్థలం ఉండాలి. లేదా ప్రభుత్వ స్థలం ఇచ్చి ఉండాలి.
♦ గుడిసె, గడ్డితో పైకప్పు నిర్మించిన ఇల్లు, మట్టిగోడలతో నిర్మించిన తాత్కాలిక ఇల్లున్న వారుకూడా ఈ పథకానికి అర్హులే.
♦ అద్దె ఇంట్లో ఉన్నవారు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
♦ వివాహం అయిన, ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నా లబ్ధదారుడిగా ఎంపిక చేస్తారు.
♦ సింగిల్ ఉమెన్, వితంతు మహళలు కూడా లబ్ధిదారులే.
ఇందిరమ్మ ఇళ్లకు అర్హత పొందిన వారి జాబితాను ప్రభుత్వం ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది. అయితే.. తొలి విడత లబ్ధిదారుల ఫైనల్ జాబితా ఫిబ్రవరి మొదటి వారంలో రానున్నట్లు తెలుస్తుంది. అయితే, దరఖాస్తు చేసిన వారు ఈ జాబితాలో మీ పేరు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ జాబితాను తనిఖీ చేయాలనుకునే వారు పథకం యొక్క అధికారిక వెబ్సైట్ https://indirammaindlu.telangana.gov.in లోకి వెళ్లాలి.
కొత్త పేజీ ఇక్కడ ఓపెన్ అవుతుంది.
దీనిలో కుడివైపు పైభాగంలో మోర్ (More) అని ఉంటుంది.
More పై క్లిక్ చేస్తే అప్లికేషన్ సర్చ్ అని వస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
Application Search లో దరఖాస్తుదారులు (మొబైల్ నంబర్ లేదా ఆధార్ నంబర్ లేదా అప్లికేషన్ నంబర్ లేదా రేషన్ కార్డ్ నంబర్లలో ఏదో ఒకదానికి సంబంధించిన వివరాలను నమోదు చేసి కింద గో బటన్ పై క్లిక్ చేయాలి. మీ పేరు ఉంటే మీకు సంబంధించిన వివరాలు వస్తాయి.
