Seaplane Tourism: ట్యాంక్బండ్పై విమానం ఎక్కి.. ప్రకాశం బ్యారేజీ వద్ద దిగొచ్చు.. తెలుగు రాష్ట్రాల్లో ‘సీ-ప్లేన్’ హంగామా
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పర్యాటక రంగానికి కొత్త ఊపిరి పోసేందుకు తెలంగాణ ప్రభుత్వం సీ-ప్లేన్ (Seaplane Tourism)ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది.
- V Santhosh Kumar
- Published on- August 10, 2026 / 09:30 AM IST
Hussainsagar to prakasam barrage seaplane tourism service hyderabad vijayawada
- హుస్సేన్సాగర్-ప్రకాశం బ్యారేజీ సీ-ప్లేన్ ప్రాజెక్ట్
- నీటిపైనే టేకాఫ్ అండ్ ల్యాండింగ్
- ఎయిర్పోర్ట్ అథారిటీ ఏఏఐ సర్వే
Seaplane Tourism: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పర్యాటక రంగానికి కొత్త ఊపిరి పోసేందుకు తెలంగాణ ప్రభుత్వం సీ-ప్లేన్ (Seaplane Tourism)ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. హైదరాబాద్లోని ట్యాంక్బండ్ నుంచి బయలుదేరి ఆకాశం నుంచే బుద్ధ విగ్రహం, సచివాలయం, కృష్ణా నది అందాలను తిలకిస్తూ విజయవాడ ప్రకాశం బ్యారేజీకి చేరుకునేలా ఈ సరికొత్త పర్యాటక సర్క్యూట్ను రూపొందిస్తున్నారు. పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచే ఈ ప్రాజెక్టుపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చర్చించడంతో ప్రతిపాదనలు వేగవంతమయ్యాయి.
ఎయిర్పోర్ట్ అథారిటీ పరిశీలనలు, ఏర్పాట్లు:
ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం ఇప్పటికే హైదరాబాద్లో క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసింది. నీళ్లపైనే టేకాఫ్, ల్యాండింగ్ అయ్యే సౌకర్యం ఉన్న ఈ సీ-ప్లేన్ల కోసం హుస్సేన్సాగర్లో నిర్దిష్ట పాయింట్లను ఖరారు చేసే పనిలో నిమగ్నమైంది. త్వరలోనే ప్రకాశం బ్యారేజీ వద్ద కూడా ఏఏఐ బృందం పరిశీలన జరిపి, రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సమగ్ర నివేదిక సమర్పించనుంది.
పర్యాటకరంగానికి కొత్త ఊపు, ప్రత్యేకతలు:
ప్రత్యేక రన్వే అవసరం లేని ఈ విమానాల్లో ఒకేసారి 9 నుండి 12 మంది ప్రయాణికులు ప్రయాణించే అవకాశం ఉంది. తెలంగాణ టూరిజం రోడ్మ్యాప్ 2025లోనూ భాగమైన ఈ సీ-ప్లేన్ సర్వీస్ అందుబాటులోకి వస్తే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పర్యాటకరంగం గణనీయంగా పుంజుకుంటుంది. గతంలోనూ ఉన్న ఈ ఆలోచనను ప్రస్తుత ప్రభుత్వం సీరియస్గా తీసుకొని అమల్లోకి తెచ్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది.
