×
Ad

Hyderabad : కాలుష్యం నుంచి బయటపడుతున్న మూసీ, హుస్సేన్ సాగర్‌లు

కాలుష్యంతో నిండిపోయిన హైదరాబాద్ మహానగరంలోని మూసీ, హుస్సేన్ సాగర్‌లు కాలుష్యం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి.

  • Published On : February 14, 2022 / 01:24 PM IST

Musi River And Hussain Sagar

Decreasing pollution in the musi river and hussain sagar : మూసీ నది అనగానే ముక్కు మూసుకుంటాం. హుస్సేన్ సాగర్ చూడాఆశపడతాం. తీరా వెళ్లాక అక్కడ కూడా ముక్కు మూసుకోవాల్సి వస్తుంది. తీవ్ర కాలుష్యంగా మారిపోయాయి హైదరాబాద్ నగరంలోని రెండు ప్రధాన నీటి వనరులైన మూసీ, హుస్సేన్ సాగర్ లు. కానీ ఇటీవల కాలంలో వీటి కాలుష్యాన్ని నిర్మూలించటానికి చేపట్టిన చర్యలు చక్కటి ఫలితాలనిస్తున్నాయి. దీంట్లో భాగంగానే ఇప్పుడు మూసీ నది, హుస్సేన్ సాగర్ లు కాలుష్యం బారినుంచి బయటపడుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాలు తమ నదులలో పెరుగుతున్న కాలుష్య స్థాయిలతో పోరాడుతున్న క్రమంలో హైదరాబాద్ నగరంలోని రెండు ప్రధాన నీటి వనరులైన మూసీ, హుస్సేన్ సాగర్ నదులు కాలుష్యం నుంచి బయటపడుతున్నాయి. గత కొన్నేళ్లుగా మూసీ నది, హుస్సేన్ సాగర్ నీటి నాణ్యత చాలా మెరుగుపడిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్, తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ నీటి సరఫరా మరియు మురుగునీటి బోర్డు సహా అనేక అధికారులు ఈ నీటి వనరులలో కాలుష్య స్థాయిలను తగ్గించడానికి కలిసి పనిచేస్తున్నారు. దీంతో ఈ రెండు నీటి వనరులు కాలుష్యం నుంచి కోలుకుంటున్నాయి.

దీని గురించి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సేంద్రియ పదార్థాలు కుళ్ళిపోయేటప్పుడు బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు వినియోగించే ఆక్సిజన్ పరిమాణాన్ని సూచించే బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ స్థాయి మూసీలో పడిపోయింది. 2014లో BOD 58 mg/L ఉండగా, 2020లో అదే 22 mg/Lగా నమోదైంది.

దీని గురించి నేషనల్ గ్రీన్ కార్ప్స్ డైరెక్టర్ డబ్ల్యూజీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. “హైదరాబాద్‌లో కొన్ని మంచి రుతుపవనాలు ఉన్నాయి. ఫలితంగా మూసీ, హుస్సేన్ సాగర్‌లలో నీటి మెరుగుదల ఏర్పడింది. మరొక అంశం ఏమిటంటే, జీహెచ్‌ఎంసీ, టీఎస్‌పీసీబీ, హెచ్‌ఎండబ్ల్యుఎస్‌ఎస్‌బీలు తమ నీటి వనరులలోకి ప్రవేశించే మురుగునీటిని మొదట శుద్ధి చేసేలా నిరంతరం కృషి చేయడం. అధికారులు పూడిక తీసి ఘన వ్యర్థాలను తరలించి అందులో ప్రవహించే నీరు పరిశుభ్రంగా ఉండేలా చేస్తున్నారని తెలిపారు. గతంలో 10 నుంచి 20 శాతం మురుగునీటిని మాత్రమే శుద్ధి చేసేవారు. అది ఇప్పుడు దాదాపు 70 నుంచి 80 శాతానికి చేరుకుంది’ అని తెలిపారు. దీంతో ఇవి కాలుష్యం బారినుంచి కోలుకుంటున్నాయి.