Yellamma Kalyanam : వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం..కుటుంబ సమేతంగా హాజరైన మంత్రులు
హైదరాబాద్ నగరంలోని బల్కంపేటలో కొలువైన ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం వైభోవంగా జరిగింది. ఈ మహోత్సవానికి మంత్రులు కుటుంబ సమేతంగా హాజరయ్యారు.ప్రభుత్వం తరపునుంచి మంత్రులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
- nagamani
- Published On : July 13, 2021 / 02:05 PM IST
Templ
Bulkampeta Yellamma Kalyanam : బోనాల పండుగ వచ్చిందంటే చాలు తెలంగాణ అంతా పండుగ వాతావరణం సందడి సందడిగా ఉంటుంది. ఈ బోనాల ఉత్సవాల్లో బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవం ఓ ప్రత్యేకమైనది. ప్రతీ ఏటా అంగరంగవైభవంగా అమ్మవారి కల్యాణమహోత్సవం జరుగుతుంటుంది. ఈ ఏడాది కరోనా సమయంలో కూడా అమ్మవారి కల్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా కల్యాణ వేడుకను నిర్వహించారు ప్రభుత్వం ప్రతినిథులు. ఈ వేడుకను తిలకించేందుకు నగరంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు.
ఈ మహోత్సవంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు. అమ్మవారి కల్యాణాన్ని తిలకించేందుకు మంత్రులు తమ కుటుంబ సమేతంగా వచ్చారు.కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కార్పొరేటర్ కేతినేని సరళ, మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ప్రావీణ్య, డిప్యూటీ కమిషనర్ వంశీకృష్ణ, అధికారులు పాల్గొన్నారు.
అమ్మవారి కల్యాణం సందర్భంగా ఆ ప్రాంతంతో పాటు ఆ ప్రాంతానికి వచ్చే దారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆలయ పరిసరాల్లో మూడు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసుల సూచించారు. అమీర్ పేట్ సత్యం థియేటర్ నుంచి ఫతేనగర్ వైపు వెళ్లే వాహనదారులు S.S బేకరీ దగ్గర నుంచి వెళ్లాలని చెప్పారు. అభిలాష టవర్స్, బీకే గూడ క్రాస్ రోడ్స్, బోగా రెసిడెన్సీ హోలీ క్రాస్ మీదుగా ఫతేనగర్ వెళ్లాలని సూచించారు ట్రాఫిక్ పోలీసులు.
