HYDRA Commissioner Ranganath
HYDRA Commissioner Ranganath: హైడ్రా అంటే బూచి కాదని, ఒక భరోసా అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. ఇవాళ ఆయన హైదరాబాద్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. అక్రమ కట్టడాలను మాత్రమే కూల్చేస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ మనందరి బాధ్యత అని రంగనాథ్ చెప్పారు.
అమీన్పూర్లో గతంలో ఓ హాస్పిటల్ను కూల్చినా మళ్లీ నిర్మించారని అన్నారు. అక్కడ కూల్చిన ఆసుపత్రిలో రోగులు ఎవరూలేరని, వీడియో కూడా రికార్డు చేశామని తెలిపారు. అమీన్పూర్లో ప్రభుత్వం భూములు పెద్దఎత్తున అన్యాక్రాంతం అయ్యాయని తెలిపారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకే సీఎం హైడ్రాను తీసుకొచ్చారని రంగనాథ్ చెప్పారు. పరిశుభ్రమైన వాతావరణం అనేది రాజ్యాంగంలో భాగమని చెప్పారు.
హైడ్రాను ఏర్పాటు చేసి 2 నెలలైందని రంగనాథ్ అన్నారు. హైడ్రాను భూతంలా చూపిస్తున్నారని, తప్పు చేసిన బిల్డర్లపై క్రిమినల్ కేసులు పెడుతున్నామని తెలిపారు. హైడ్రా కారణంగా ఎవరూ ఆత్మహత్యలు చేసుకోలేదని రంగనాథ్ స్పష్టం చేశారు.
వరదల నుంచి ప్రజలను కాపాడటమే హైడ్రా లక్ష్యమని రంగనాథ్ చెప్పారు. ముందుగా నోటీసులు ఇచ్చి కూల్చుతున్నామని, ఇష్టారాజ్యంగా ఆక్రమణలు చేసుకుంటూపోతే కట్టడి చేయవద్దా? అని అన్నారు.