Adilabad Airport: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రాజెక్టులో కీలక అప్డేట్.. మిషన్ మోడ్లో పనులు.. ఢిల్లీలో కేంద్రమంత్రుల సమీక్ష
ఆదిలాబాద్ (Adilabad Airport)జిల్లా, తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైన ఆదిలాబాద్ విమానాశ్రయం ఏర్పాటు దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి.
- V Santhosh Kumar
- Updated on- September 12, 2026 / 07:40 PM IST
Union Ministers review on Adilabad airport project master plan and land acquisition.
- ఆదిలాబాద్ విమానాశ్రయ ప్రాజెక్టు వేగం
- 1500 ఎకరాల భూసేకరణ ప్రణాళిక
- ఉత్తర తెలంగాణకు విమాన సౌకర్యం
Adilabad Airport: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు మొత్తం ఉత్తర తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైన ఆదిలాబాద్(Adilabad Airport) విమానాశ్రయం ఏర్పాటు దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. వాణిజ్యపరంగా, వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాంతంలో జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్ (JUA) ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. న్యూఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పౌర విమానయాన మంత్రి కె.రామ్మోహన్ నాయుడుతో కలిసి కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఈ ప్రాజెక్టుపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
నోడల్ ఆఫీసర్ల నియామకం.. మాస్టర్ ప్లాన్ వేగవంతం:
ప్రాజెక్టు పురోగతిని వేగవంతం చేసేందుకు రక్షణ శాఖ, పౌర విమానయాన శాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే వారంలోగా ఒక్కో నోడల్ ఆఫీసర్ను నియమించాలని నిర్ణయించారు. జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్కు సంబంధించిన డీపీఆర్ (DPR), మాస్టర్ ప్లాన్ రూపకల్పన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఉత్తర తెలంగాణలో పౌర విమానయాన సౌకర్యాలు పెంచడంతో పాటు దేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు ఆదిలాబాద్ వ్యూహాత్మకంగా అత్యంత కీలకమని, దీని అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హామీ ఇచ్చారు.
అదనంగా 1,500 ఎకరాల సేకరణ.. అధునాతన సదుపాయాలు:
ఈ విమానాశ్రయం కోసం 2.75 కిలోమీటర్ల రన్వే నిర్మించనున్నారు. ఐఏఎఫ్ వద్ద ఉన్న 369.45 ఎకరాలకు అదనంగా తెలంగాణ ప్రభుత్వం మరో 1,500 ఎకరాల భూమిని సేకరించనుంది. ఇక్కడ ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్లు, హ్యాంగర్స్, ట్రైనింగ్ అండ్ మెయింటెనెన్స్ సదుపాయాలతో పాటు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ఆధ్వర్యంలో ఆధునిక సివిల్ టెర్మినల్, ‘మెయింటెనెన్స్ అండ్ రిపేర్ ఆపరేషన్స్’ (MRO) ఫెసిలిటీని ఏర్పాటు చేయనున్నారు. ఏళ్ల నిరీక్షణ తుది దశకు చేరిందని, ఈ ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణ రూపురేఖలు మారనున్నాయని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
