Nagam Janardhan Reddy-Jagadishwar Rao
Nagam Janardhan Reddy: తెలంగాణలోని వనపర్తి, కొల్లాపూర్, నాగర్ కర్నూల్ నియోజక వర్గాల కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎన్నికల వేళ టికెట్ల విషయంలో తమ పార్టీ తీరుపై మండిపడుతున్నారు. ఇవాళ నాగర్ కర్నూల్ జిల్లా, పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లిలో మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, టీపీసీసీ సభ్యుడు సీఆర్ జగదీశ్వర్ రావు తమ అనుచరులతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
సీఆర్ జగదీశ్వర్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాను స్వతంత్ర అభ్యర్థిగా నిలబడుతున్నానని, తనను ఆశీర్వదించాలని కోరారు. తినే పళ్లెంలో జూపల్లి కృష్ణారావు మట్టి కొట్టారని చెప్పారు. భవిష్యత్తు బీసీలదేనని వారిని సంపూర్ణంగా సహకరిస్తానని తెలిపారు.
నాగం జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి అన్యాయం జరిగినా అందుకు బాధ్యతవహించాల్సింది టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డేనని చెప్పారు. కాంగ్రెస్ లో మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు ఘోర అవమానం జరిగిందని అన్నారు.
టికెట్ల కేటాయింపులో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండు ఒకటే అనుకోవాలా అని ప్రశ్నించారు. సీఆర్ జగదీశ్వర్కు తాను ఉన్నానని చెప్పారు. ఆయనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. సీఆర్ జగదీశ్వర్ రావు కోసం కొల్లాపూర్ లో ప్రచారం చేస్తానని ప్రకటించారు.
Ponnala Lakshmaiah : బీఆర్ఎస్లో చేరిన పొన్నాల లక్ష్మయ్య, పార్టీ కండువా కప్పిన సీఎం కేసీఆర్