కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు కాబట్టే అప్పట్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు.
సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం వల్లే కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు ఎదిగారని జగ్గారెడ్డి చెప్పారు. దేశం కోసం ఇందిరా గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని తెలిపారు. ఇందిరా గాంధీ చిన్న వయసులోనే స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారని, ఆరేళ్లు జైలు జీవితం గడిపారని చెప్పారు.
దేశ ప్రయోజనాల కోసం జైలు జీవితం గడిపిన చరిత్ర నరేంద్ర మోదీ, కేసీఆర్కు ఉందా అని జగ్గారెడ్డి నిలదీశారు. దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదంటూ బీఆర్ఎస్ నేతలు అంటున్నారని చెప్పారు. ఇందిరా గాంధీ 16 ఏళ్లు ప్రధానిగా ఉండి దేశంలో, ఉమ్మడి రాష్ట్రంలోని దళితులకు ప్రభుత్వ భూములను పంచి పెట్టారని తెలిపారు.
పేదలను దృష్టిలో పెట్టుకుని ఇందిరా గాంధీ బ్యాంకులను జాతీయం చేసిందని జగ్గారెడ్డి చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు కట్టించారని తెలిపారు. యువత భజరంగ్ దళ్ పాటలకు చిందులు వేయడం కాదని, చరిత్ర గురించి తెలుసుకోవాలని అన్నారు.
Also Read: పార్టీల ఉచిత హామీలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పంచ్ డైలాగులు