Jalagam Venkatarao
Jalagam – Vanama : కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు వేసింది. ఆయన ఎన్నిక చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. ఎమ్మెల్యే పదవికి వనమా వెంకటేశ్వరరావును అనర్హుడిగా ప్రకటిస్తూ తీర్పు వెల్లడించింది. కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావును ప్రకటిస్తూ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో బుధవారం జలగం వెంకట్రావు అసెంబ్లీ కార్యదర్శిని కలిశారు. కోర్టు ఉత్తర్వులను కార్యదర్శికి అందజేశారు. ఈ సందర్భంగా జలగం వెంకట్రావు 10టీవీతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
వనమా వెంకటేశ్వరరావుపై 2019లో హైకోర్టులో పిటిషన్ వేశానని, వాదనలు విన్న కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చిందని జలగం అన్నారు. నన్ను ఎమ్మెల్యేగా కోర్టు పరిగణించిందని, వనమా వెంకటేశ్వరరావును డిస్క్యాలిఫై చేసిందని జలగం చెప్పారు. నాది నైతిక విజయం అన్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో తీర్పును అమలు చేయాలని సెక్రటరీని కలవడం జరిగిందని, స్పీకర్తో ఫోన్లో మాట్లాడానని జలగం తెలిపారు.
2018 ఎన్నికల్లో అనేక కుతంత్రాలు అన్ని చూశామని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతూ వచ్చానని, కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని జలగం స్పష్టం చేశారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని కలుస్తానని అన్నారు. ఎమ్మెల్యేగా మూడు నెలల్లో కొత్తగూడెంకు ఏం చేయాలో నాకు ఎజెండా ఉందని, ఆ మేరకు ముందుకు సాగుతానని జలగం వెంకట్రావు తెలిపారు.