CM Revanth Reddy
Kaleshwaram Project: మంచో చెడో.. కాళేశ్వరం చుట్టే చర్చ జరగాలి. బీఆర్ఎస్ను ఇరకాటంలో పెట్టాలి. ఇదే స్ట్రాటజీతో రేవంత్ సర్కార్ ముందుకెళ్తోందని మండిపడుతోంది గులాబీ పార్టీ. లేటెస్ట్గా కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అపోజిషన్ లీడర్లు. ఇప్పటికే కాళేశ్వరంపై విచారణకు సీబీఐ రిఫర్ చేసింది స్టేట్ సర్కార్.
ఇప్పటికే సీబీఐ దర్యాప్తు కూడా స్టార్ట్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడేమో కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా ఉన్న అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీల రిపేర్ అంటూ కొత్త చర్చకు తెరలేపింది. ఇక్కడే బీఆర్ఎస్ డౌట్స్ వ్యక్తం చేస్తోంది. కాళేశ్వరం కూలేశ్వరం అని..లక్ష కోట్లు నీళ్ల పాలు అయ్యాయని ప్రచారం చేసిన కాంగ్రెస్.. ఇప్పుడెందుకు మరమ్మత్తులు అంటూ కొత్త జమ్మిక్కులు స్టార్ట్ చేసిందో చెప్పాలని డిమాండ్ చేస్తోంది కారు పార్టీ.
కాళేశ్వరం విషయంలో రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవడంతో..రేవంత్ సర్కార్ కొత్త డ్రామాకు తెరలేపిందని అంటున్నారు బీఆర్ఎస్ లీడర్లు. సరిగ్గా స్థానిక ఎన్నికలకు ముందు NDSA కమిటీ దర్యాప్తు ఆధారంగా రిహాబిలిటేషన్, రీస్టోరేషన్ డిజైన్లు చేయాలని తీసుకోవడానికి కారణమేంటో చెప్పాలంటోంది. (Kaleshwaram Project)
మేడిగడ్డ బ్యారేజ్లో ఓ పియర్ కుంగుబాటుకు గురైంది. ఆ ఒక్కటి మాత్రమే రిపేర్ చేయకుండా..అన్నారం, సుందళ్ల బ్యారేజీ మీద కూడా స్టడీ చేయాలని ఎందుకు భావిస్తున్నారో చెప్పాలంటోంది బీఆర్ఎస్. ఇక్కడే ప్రభుత్వం కుట్ర ఏంటో అర్థమవుతోందని మండిపడుతోంది. లోకల్ బాడీ ఎన్నికలకు ముందు మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టును అస్త్రంగా వాడుకునేందుకు..అన్నారం, సుందిళ్లలో కూడా లోపాలు ఉన్నాయని బద్నాం చేసే ప్లాన్ చేస్తున్నారని ఆరోపిస్తోంది.
ఆల్ ఆఫ్ సడెన్గా ప్రభుత్వం రిహాబిలిటేషన్, రిపోర్టేషన్ డిజైన్లు టెండర్లు కాల్ చేయడంపై పొలిటికల్ సర్కిల్స్లోనూ రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలకు సంబంధించి..చాలా రోజుల క్రితమే NDSA ఒక రిపోర్ట్ ఇచ్చింది. బ్యారేజీలలో ఎక్కడెక్కడ లోపాలు జరిగాయి..ఆ లోపాలను ఎలా సరిదిద్దాలనే దానిపై రిపోర్ట్ ఇచ్చింది. అయితే ఆ నివేదిక ఆధారంగా రిహాబిలిటేషన్, రీస్టోరేషన్ డిజైన్లు చేయాలని డిసైడ్ చేయడం వెనుక పొలిటికల్ ఎజెండా ఉందనే టాక్ వినబడుతుంది. లోకల్ బాడీ ఎన్నికల సైరన్ మోగడంతో..మరోసారి కాళేశ్వరంపై చర్చ జరగాలని..కాంగ్రెస్ సర్కార్ కోరుకుంటోందట.
సీబీఐ కూడా రంగంలోకి దిగిందనే వార్తలు
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటికే విజిలెన్స్ విచారణతో పాటు.. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరిపిన నివేదిక కూడా ఇచ్చింది. కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో అనేక లోటు పాట్లను ప్రస్తావించింది. జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్పై ప్రభుత్వం అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చ కూడా చేసింది. ఆ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఇప్పటికే ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు కూడా ఆదేశించింది. సీబీఐ కూడా రంగంలోకి దిగిందనే వార్తలు వస్తూనే ఉన్నాయి. మరోవైపు విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా..కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యం అయిన పలువురు అధికారులపై ఏసీబీ విచారణ చేస్తోంది.
ఇప్పటికే పలువురు అధికారులను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు కూడా చేసింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు ఉంటే సరిచేయాలని..అటు బీఆర్ఎస్ నుంచి ఇటు గ్రౌండ్ లెవల్లో రైతుల నుంచి కూడా డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి. కాళేశ్వరం కట్టాకే తమ భూములకు నీళ్లు వచ్చాయని కొన్ని ఏరియాల్లో రైతులకు బలంగా నమ్ముతున్నారు. పైగా కాళేశ్వరం నుంచి నీళ్లు విడుదల చేయాలంటూ పలుచోట్ల ఆందోళనలు కూడా జరిగినట్లు సందర్భాలున్నాయి.
ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టును నిరుపయోగంగా ఉంచారన్న అపవాదు రాకుండా..అలా అని ఆ ప్రాజెక్టుపై ముందడుగు వేయకుండా..సేమ్టైమ్ ఎప్పుడూ చర్చలో ఉండేలా బ్లేమ్ గేమ్ ఆడుతున్నారని బీఆర్ఎస్ ఫైర్ అవుతోంది. అయితే ఓవైపు దర్యాప్తు జరుగుతుండగా..ఇప్పుడు రిపేర్లు చేయాలనుకోవడం వెనుక ఏదో కుట్ర ఉందన్న అనుమానాలు తెరమీదకు తెస్తోంది అపోజిషన్. ఏదైనా కాళేశ్వరం కాక..తెలంగాణ పాలిటిక్స్లో నిత్యం ఓ న్యూస్గా కొనసాగుతూనే ఉంది. ఇది ఇంకెన్నాళ్లు లైమ్లైట్లో ఉంటుందో..కాళేశ్వరం అంశానికి ఎండ్ కార్డ్ ఎప్పుడో వేచి చూడాలి మరి.