Kalvakuntla Kavitha New Party : BRS ప్లీనరీకి 2 రోజుల ముందే కవిత కొత్త పార్టీ ప్రకటన.. ఏప్రిల్ 25న కీలక ప్రకటన
Kalvakuntla Kavitha New Party : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల తన కొత్త పార్టీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
- Dharani Pilli
- Published On : April 8, 2026 / 03:44 PM IST
alvakuntla kavitha interesting comments on new party latest update
- కొత్త పార్టీపై కవిత ఆసక్తికర వ్యాఖ్యలు
- ఏప్రిల్ 25న తెలంగాణ చరిత్ర మారబోతుంది
- మూడేళ్ల తర్వాత రాష్ట్రంలో సామాన్యుల ప్రభుత్వం
Kalvakuntla Kavitha New Party : బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. కొత్త పార్టీ పెడతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 25న పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటిస్తానని ఇప్పటికే కవిత స్పష్టం చేశారు. పైగా కవిత కొత్త పార్టీ పేరు టీఆర్ఎస్ అంటూ ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతోంది. దీనితో పాటు ఏప్రిల్ 25న పార్టీ పేరు ప్రకటించడం కూడా వ్యూహాత్మక ఎత్తుగడ అంటున్నారు. కారణం ఏప్రిల్ 27న బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ. దానికి రెండు రోజుల ముందే కవిత పార్టీ ప్రకటన నిర్ణయం వెలువడటం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలవబోతుంది.
కొత్త పార్టీ ఏర్పాటు గురించి కవిత మంగళవారం నాడు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 25న తెలంగాణ చరిత్రను మార్చే, తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దే పార్టీ వస్తుంది అన్నారు కవిత. పార్టీ ఆవిర్భావం రోజు అద్భుతమైన ఎజెండా ప్రకటిస్తామని తెలిపారు. ఖమ్మం, వెలుగుమట్ల తరహాలో మూడేళ్ల పాటు ప్రజల్లోనే ఉండి సమస్యలపై పోరాడతామన్నారు. తమ పార్టీ.. అజెండా.. ప్రశ్నిస్తాం… పోరాడతాం… పరిష్కరిస్తాం… అని చెప్పుకొచ్చారు.
Kavitha Party : తెలంగాణలో మరో కొత్త పార్టీ.. మార్చి 27న ప్రకటించనున్న కల్వకుంట్ల కవిత
తమ పార్టీ స్థాపనతో.. సామాన్యుల చేత… సామాన్యుల కోసం… సామాన్యుల ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు కవిత. కొత్త నెత్తురు, కొత్త రాజకీయంతో తెలంగాణ భవిష్యత్తును మారుస్తాం, దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అచేతన స్థితిలో ఉంది, ఆ పార్టీ నిద్రపోతోందంటూ కవిత ఎద్దేవా చేశారు. గద్వాలలో చేనేత, పత్తి రైతులకు అన్యాయం జరుగుతుంటే కూడా బీఆర్ఎస్ ప్రశ్నించడం లేదని విమర్శించారు.
అలానే అధికార కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతో ప్రజలను వంచిస్తోందని కవిత ఆరోపించారు. రాష్ట్ర పాలన మొత్తం ఢిల్లీ నుంచే జరుగుతోందని.. తెలంగాణలో గులాంగిరీ నడుస్తోందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మారిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలను రేవంత్ రెడ్డి మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు. చూస్తుంటే గద్వాల గడీ మీద ఉద్యమకారుల జెండా ఎగురుతుందని అనిపిస్తోందన్నారు కవిత.
‘గద్వాలలో 80 ఏళ్ల పాటు బంగ్లా పాలన, బండ్ల పాలన నడిచినా.. ఆడపిల్లలకు చదువు చెప్పలేదని విమర్శించారు. సీడ్ పత్తితో అరుణమ్మ, 40 మంది ఏజెంట్లు బందిపోట్లలా దోచుకుంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని’ కవిత ఆరోపించారు.
‘చేనేత కార్మికులకు ఉచితంగా నూలు, రంగులు ఇచ్చే పథకాలను కొనసాగించాలి. ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై పోటీ చేస్తే జోగులాంబ జిల్లాలో మొదటి విజయం దక్కింది. ఎమ్మెల్యే సీట్లలో మొదట గద్వాలలోనే విజయం సాధిస్తామని విశ్వాసం ఉంది. కట్టప్ప గురించి ఉన్నట్లే… బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారని అందరిలో ఉన్న ప్రశ్న. తాను ఏ పార్టీలో ఉన్నారో కూడా కృష్ణమోహన్ రెడ్డికి అర్థం కావడం లేదంటూ’ కవిత ఎద్దేవా చేశారు.
