Kasani Gnaneshwar : తెలంగాణలో టీడీపీ పోటీపై కాసాని జ్ఞానేశ్వర్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీపై రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామని క్లారిటీ ఇచ్చారు.

Kasani Gnaneshwar Mudiraj

Kasani Gnaneshwar Mudiraj: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్స్ప ష్టం చేశారు. బుధవారం తరువాత టీడీపీ అభ్యర్థులతో పాటు, మ్యానిఫెస్టో ప్రకటిస్తామని చెప్పారు. సోమవారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అక్రమ అరెస్ట్ విషయంలో అన్నిరకాల నిరసన కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న చంద్రబాబును శనివారం మూలఖత్ లో కలవడం జరిగిందని తెలిపారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి చర్చించానని, అలాగే ఆయన ఆరోగ్యం గురించి కూడా వాకబు చేశామన్నారు. చంద్రబాబు చాలా ధైర్యంగా ఉన్నారని, కొద్దిగా బరువు తగ్గారని తెలిపారు.

తెలంగాణలో టీడీపీ పోటీపై బుధవారం నాటికి క్లారిటీ వస్తుందని కాసాని తెలిపారు. తమపైకొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, వాటిని ఖండిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కచ్చితంగా 119 స్థానాల్లోనూ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తామా, లేదా అనేది భవిష్యత్తులో తెలుస్తుందన్నారు.

త్వరలో అభ్యర్థుల ప్రకటన, మేనిఫెస్టో విడుదల
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని.. కాంగ్రెస్ పార్టీ తమ కంటే బలంగా ఉందనేది తాము నమ్మడం లేదన్నారు. తెలంగాణలో పోటీ చేయబోయే అభ్యర్థులతో పాటు మేనిఫెస్టో కూడా విడుదల చేస్తామని కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం, అలాగే తెలంగాణలో కావలసిన అన్ని విషయాలు దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టోను రూపొందిస్తామని వెల్లడించారు. బుధవారం మరోసారి చంద్రబాబు నాయుడిని కలిసి అభ్యర్థులు ఎంపిక, జనసేన పార్టీతో పొత్తుపై చర్చించనున్నట్టు తెలిపారు.

Also Read: రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా నా ఉసురు తగులుతుంది : రాగిడి లక్ష్మారెడ్డి