KBR Park One Way : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్‌వే.. 18 నుంచి ట్రాఫిక్ కొత్త రూట్‌లో!

KBR Park One Way : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్‌వే ట్రాఫిక్ రూల్ అమల్లోకి రానుంది. ఈ నెల 18 ఉదయం 6 గంటల నుంచే ట్రాఫిక్ పోలీసులు అమలు చేయనున్నారు. పూర్తి వివరాలివే

KBR Park One Way

  • ఈ నెల 18 నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి
  • జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ చుట్టూ నిబంధనలు
  • ఉదయం 6 గంటల నుంచే వన్ వే విధానం ప్రారంభం

KBR Park One Way : హైదరాబాద్‌ నగర వాహనదారులకు బిగ్ అలర్ట్.. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే అమలు చేయనున్నారు.

ఈ నెల 18వ తేదీ ఉదయం 6 గంటల నుంచి వన్‌వే విధానం అమల్లోకి రానుంది. ట్రాఫిక్ ఫ్లోను మెరుగుపరచడంతో పాటు ప్రయాణ సమయాన్ని తగ్గించడం, వాహనదారులకు సేఫ్ జర్నీ అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు.

మొత్తం 6 మేజర్ జంక్షన్లు :

కేబీఆర్ పార్క్ చుట్టూ మొత్తం 6 మేజర్ జంక్షన్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు వన్‌వే విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు వాహనాల కదలిక మరింత సాఫీగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. తద్వారా ప్రయాణ సమయం తగ్గడంతో పాటు కాలుష్యం కూడా భారీగా తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.

వన్‌వే అమలుకు ముందు ఇప్పటికే రెండుసార్లు ట్రయల్ రన్ నిర్వహించారు. ఏప్రిల్ 5న మూడు గంటల పాటు, జూన్ 21న ఆరు గంటల పాటు ట్రయల్ రన్ చేపట్టారు. ఈ ట్రయల్ రన్స్ ద్వారా వాహనదారులకు కొత్త ట్రాఫిక్ విధానంపై అవగాహన కల్పించడమే కాకుండా దాంతో ఎదురయ్యే సాంకేతిక సమస్యలను కూడా గుర్తించారు. వాటిని పరిశీలించి అవసరమైన మార్పులు, ఏర్పాట్లు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

110 పిల్లర్లు ఏర్పాటు :
ఈ ప్రాజెక్టులో మొత్తం 110 పిల్లర్లు ఏర్పాటు చేయనున్నారు. వన్‌వే అమలుతో ప్రారంభ దశలో కొన్ని నెలల పాటు వాహనదారులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే ప్రజలు, వాహనదారులు ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Read Also : Abishek Porel Arrest : మెడికో స్టూడెంట్ ఫిర్యాదు.. ఢిల్లీ క్యాపిటల్స్ యువ క్రికెటర్ అరెస్ట్.. 19 సెక్షన్లతో కేసు!

ట్రాఫిక్ నిర్వహణ కోసం 4 షిఫ్టుల్లో సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) నుంచి ట్రాఫిక్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. అంతేకాదు.. నిరంతరం 2 డ్రోన్ల ద్వారా కూడా ట్రాఫిక్‌ను మానిటర్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

వాహనదారులు ట్రాఫిక్ శాఖ అడ్వైజరీలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, వీలైనంత వరకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.

కేబీఆర్ పార్క్ పరిసరాల్లో దాదాపు 10 ప్రధాన ఆస్పత్రులు ఉన్నాయి. వన్‌వే అమలులో భాగంగా అంబులెన్స్‌లు ట్రాఫిక్‌లో ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వడం ద్వారా వాహనదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

18 నుంచి ఉదయం 6 గంటలకే :
ఈ నెల 18వ తేదీ ఉదయం 6 గంటల నుంచే కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే అమల్లోకి రానుంది. సుమారు ఏడాదిన్నర పాటు ఈ విధానం కొనసాగించే అవకాశం ఉంది. ప్రారంభంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించవచ్చు. ప్రయాణాన్ని వేగవంతంగా, సురక్షితంగా మార్చేందుకు ఈ ప్రాజెక్ట్ దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.