Khammam : ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిపై వీడిన సస్పెన్స్..! అధికారిక ప్రకటనే తరువాయి
ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచేది ఎవరనే విషయంపై పార్టీ అధిష్టానం స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది.
- Harishth Thanniru
- Published On : April 23, 2024 / 02:31 PM IST
Bhatti Vikramarka and Ponguleti Srinivas Reddy
Khammam Lok Sabha constituency : ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచేది ఎవరనే విషయంపై పార్టీ అధిష్టానం స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించిన రామ సహాయం రఘురాంరెడ్డికి టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దీంతో రామ సహాయం రఘురాంరెడ్డి తరపున కాంగ్రెస్ నేతలు మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రామసహాయం రఘురాం రెడ్డికి చెందిన రెండు సెట్ల నామినేషన్ పత్రాలను మద్దినేని స్వర్ణ కుమారి, నిరంజన్ రెడ్డి, బొర్రా రాజశేఖర్, నూకల నరేష్ రెడ్డి, రామ్మూర్తి నాయక్, ఎండీ ముస్తఫా, మలీదు జగన్, జొన్నగడ్డ రవి, రమేష్ లు దాఖలు చేశారు. ఇదిలాఉంటే.. ఇవాళ సాయంత్రం గాంధీ భవన్ లో 14 మంది అభ్యర్థులకు ఏఐసీసీ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్ మున్షి బీఫాంలు అందించనున్నారు. మిగిలిన మూడు నియోజకవర్గాల్లో ఖమ్మం రామ సహాయం రఘురామిరెడ్డి, కరీంనగర్ వెలిచాల రాజేందర్ రావు, హైదరాబాద్ సమీర్ ఉల్లాకు అధిష్టానం టికెట్ కన్ఫాన్ చేయగా.. సాయంత్రం అధికారికంగా ప్రకటన వచ్చిన తరువాత.. వారుకూడా బీఫాంలు అందుకోనున్నారు.
Also Read : విజయవాడ ఎంపీ సీటు ఆశించా.. ఎమ్మెల్యేగా పోటీ చేయలేను: సుంకర పద్మశ్రీ
ఖమ్మంలోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసేందుకు పలువురు ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. నియోజకవర్గం నుంచి తమ వర్గీయులను బరిలో నిలుపుకునేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రయత్నించారు. పొంగులేటి తన సోదరుడు ప్రసాద్ రెడ్డి, తన బంధువు రామ సహాయం రఘురాం రెడ్డి పేర్లను అధిష్టానం ముందు ఉంచగా.. భట్టి విక్రమార్క తన సతీమణి నందికి పార్లమెంట్ టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానంను కోరారు. ఒకవేళ నందినికి టికెట్ ఇవ్వని పక్షంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాయల నాగేశ్వరరావుకు ఖమ్మం లోక్ సభ టికెట్ ఇవ్వాలని అధిష్టానకు సూచించారు. మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీనియర్ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పేరును తెరపైకి తెచ్చినట్లు తెలిసింది. అయితే, కాంగ్రెస్ అధిష్టానం ప్రసాద్ రెడ్డి, రామసహాయం రఘురాం రెడ్డి, రాయల నాగేశ్వరరావు పేర్లను పరిగణలోకి తీసుకున్నట్లు, వీరిలో ఒకరి పేరును ప్రకటిస్తుందని కాంగ్రెస్ నేతలు పేర్కొంటూ వచ్చారు. తాజాగా, పొంగులేటి వియ్యంకుడు రామ సహాయం రఘురాంరెడ్డికే టికెట్ కన్ఫార్మ్ అయినట్లు తెలుస్తోంది. ఆ కారణంగానే ఆయన తరుపున పార్టీ నేతలు నామినేషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.
Also Read : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు భారీగా బందోబస్తు.. తెలంగాణకు 160 కంపెనీల కేంద్ర బలగాలు
ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తమ వర్గీయులను అభ్యర్థులుగా బరిలోకి దింపేందుకు భట్టి, పొంగులేటి తీవ్ర ప్రయత్నాలు చేశారు. పొంగులేటి సూచించిన వ్యక్తి రఘురాంరెడ్డికే అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన పేరును ఈరోజు, రేపు అధిష్టానం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణలో మొత్తం 17 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించిన స్థానాల్లో కమ్మ సామాజిక వర్గానికి కాంగ్రెస్ అధిష్టానం ప్రాధాన్యత కల్పించలేదు. ఖమ్మం నియోజకవర్గం నుంచి ఆ సామాజిక వర్గం వ్యక్తికి అధిష్టానం అవకాశం ఇస్తుందని భావించారు. కానీ, ఖమ్మం నుంచికూడా అవకాశం లేదని తెలుస్తోంది.
