తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు భారీగా బందోబస్తు.. తెలంగాణకు 160 కంపెనీల కేంద్ర బలగాలు

ఏపీలో ఎన్నికల బందోబస్తుకు పటిష్ఠమైన బందోబస్తు పెడుతున్నారు. అసెంబ్లీతో, ఎంపీ ఎన్నికలు జరుగుతుండటంతో టైట్ సెక్యూరిటీ పెడుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు భారీగా బందోబస్తు.. తెలంగాణకు 160 కంపెనీల కేంద్ర బలగాలు

Election Security in Telugu States: లోక్‌సభ ఎన్నికల వేళ.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా బలగాలను మోహరిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచే విడతలవారీగా భద్రతా సిబ్బందిని ఏపీ, తెలంగాణకు పంపిస్తోంది. తెలంగాణలో భారీగా సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్స్‌ దళాలను మోహరించారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న దాదాపు 60వేల మంది పోలీసులకు తోడు 150-160 కంపెనీల కేంద్ర బలగాలు విధుల్లో పాల్గొననున్నాయి. అస్సాం రైఫిల్స్‌, బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌, ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ బలగాలతో బందోబస్తు పెడుతున్నారు.

మే నెల మొదటివారంలో మరిన్ని బలగాలు
ఒక్కో కంపెనీలో 70 నుంచి 80 మంది సిబ్బంది ఉంటారు. కేంద్రం నుంచి దాదాపు 60 కంపెనీల బలగాలు ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. భద్రతా సిబ్బందిని ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్‌ యూనిట్లకు పంపించారు. యూనిట్ల వారీగా ఏర్పాటు చేసిన అంతర్గత చెక్‌పోస్టులతో పాటు సరిహద్దు చెక్‌పోస్టుల దగ్గర తనిఖీలు కొనసాగుతున్నాయి. మరో 100 కంపెనీల బలగాలను పంపించాలని కేంద్రానికి అధికారులు లేఖ రాశారు. రెండు, మూడో విడత ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో పోలింగ్‌ పూర్తయిన తర్వాత మే నెల మొదటివారంలో మరిన్ని బలగాలు తెలంగాణకు వచ్చే అవకాశం ఉంది.

సరిహద్దుల్లో గ్రేహౌండ్స్‌ కూంబింగ్‌
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో బలగాలను ఎక్కువగా మోహరించే అవకాశముంది. గతంతో పోల్చితే రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం పెద్దగా లేకపోయినా.. ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో కొనసాగుతోన్న ఉద్రిక్త పరిస్థితులతో నిఘా పెంచారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లాల సరిహద్దుల్లో గ్రేహౌండ్స్‌ కూంబింగ్‌ కొనసాగుతోంది. మే నెల మొదటి వారంలో వచ్చే కేంద్ర బలగాల్లో ఎక్కువ మందిని సమస్యాత్మక ప్రాంతాల్లో మోహరించనున్నారు.

Also Read: 25 ఏళ్ల అనుభవం వర్సెస్ 10 ఏళ్ల రాజకీయ చాణక్యం.. గురుశిష్యుల సమరంలో విజేత ఎవరు?

465 కంపెనీల సాయుధ బలగాలు
ఏపీలో ఎన్నికల బందోబస్తుకు పటిష్ఠమైన బందోబస్తు పెడుతున్నారు. అసెంబ్లీతో, ఎంపీ ఎన్నికలు జరుగుతుండటంతో టైట్ సెక్యూరిటీ పెడుతున్నారు. లక్షా 14 వేల మంది సివిల్ పోలీసులతో పాటు.. 58 కంపెనీల పారామిలటరీ బలగాలు, 465 కంపెనీల సాయుధ బలగాలు అవసరమని ఏపీ ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే వందకుపైగా కంపెనీల బలగాలు విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. మరో వారం రోజుల్లో పూర్తిస్థాయి భద్రతా సిబ్బందిని గ్రౌండ్‌లోకి దించే అవకాశం ఉంది.