బీఆర్ఎస్‌ గురించి కుండబద్దలు కొట్టిన గుత్తా సుఖేందర్ రెడ్డికి ధన్యవాదాలు: మంత్రి కోమటిరెడ్డి 

Komatireddy Venkat Reddy: బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఫ్లోర్ లీడర్ అనే విషయమే మర్చిపోయి ఏది పడితే అది మాట్లాడుతున్నారని అన్నారు.

బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యే సెంట్రిక్ రాజకీయాలు సరికాదని, ఎమ్మెల్యేల అహంకారం ఆ పార్టీ కొంపముంచిందని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన కామెంట్లపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సుఖేందర్ రెడ్డి తొలిసారి చాలాబాగా మాట్లాడారని చెప్పారు.

అన్ని నిజాలే చెప్పారని, బీఆర్ఎస్‌ గురించి కుండబద్దలు కొట్టిన సుఖేందర్ రెడ్డికి ధన్యవాదాలని కోమటిరెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ 14 ఎంపీ సీట్లు గెలుస్తుందని, బీజేపీ 2-3 సీట్లు గెలుస్తుందని తెలిపారు. ఇక బీఆర్ఎస్‌కు ఒక్క సీట్ రావడం కూడా కష్టమేనని అన్నారు. మెదక్‌లోనూ బీఆర్ఎస్ మూడో స్థానంలో ఉంటుందని తెలిపారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లా సాగునీటి రంగానికి కేసీఆర్ అన్యాయం చేసినట్లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు ఆయన ఏ ముఖం పెట్టుకొని మిర్యాలగూడ నుంచి బస్సు యాత్ర చేపడుతున్నారని నిలదీశారు. ఉద్యోగులకు మూడు డీఏలు పెండింగ్‌లో పెట్టిన ఘనత కేసిఆర్‌దని విమర్శించారు. లోక్‌సభ తొలి పోలింగ్ లో ఇండియా కూటమి ఎక్కువ సీట్లు దక్కాయని చెప్పారు. బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఫ్లోర్ లీడర్ అనే విషయమే మర్చిపోయి ఏది పడితే అది మాట్లాడుతున్నారని అన్నారు.

Also Read: ఎన్నికల వేళ పలు రంగాలకు చెందిన వారి మనోగతాన్ని ఆవిష్కరించే ‘10టీవీ కాన్‌క్లేవ్ ఏపీ రోడ్‌మ్యాప్’

ట్రెండింగ్ వార్తలు