పార్టీ ఫిరాయింపులపై మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ను బీఆర్ఎస్ మొదటి దెబ్బ జూబ్లీ హిల్స్లో కొట్టబోతుందని కేటీఆర్ చెప్పారు. రెండో దెబ్బ రాజేంద్రనగర్ లేదా ఖైరతాబాద్లో కొడుతామని అన్నారు. కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని చెప్పారు.
Also Read: పోలీస్ కానిస్టేబుల్ను చంపిన నిందితుడి అరెస్ట్.. అక్కడ దాక్కున్న రియాజ్.. అయినప్పటికీ..
దమ్ముంటే ఉప ఎన్నికకు రావాలని సవాలు విసిరారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు తథ్యం అని కేటీఆర్ చెప్పారు. రెండేళ్ల తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందని, కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.
కాగా, హైడ్రా పెద్ద నేతల ఇళ్లను కూల్చడం లేదని, పేదల వద్ద నివాస పత్రాలు ఉన్నప్పటికీ వారి ఇళ్లను కూలుస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు చెరువు పరిధిలో ఉన్నప్పటికీ దాని జోలికి వెళ్లడం లేదని తెలిపారు.
అలాగే, పట్నం మహేందర్రెడ్డి గెస్ట్ హౌస్ కూడా చెరువు పరిధిలోనే ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదని కేటీఆర్ చెప్పారు. కొందరు మంత్రుల ఇంటికి కూడా వెళ్లడం లేదని విమర్శించారు.