Registration Charges : తెలంగాణలో నేటి నుంచి కొత్త చార్జీలు, అమల్లోకి పెరిగిన భూముల ధరలు

తెలంగాణలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువలు, రిజిస్ట్రేషన్ రుసుములు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. నేటి నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. ఇందుకు అనుగుణంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ‘కార్డ్’ సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన మార్పులు చేర్పులు చేశారు.

  • Updated on- July 22, 2021 / 11:20 AM IST

Registration Charges

Registration Charges : తెలంగాణలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువలు, రిజిస్ట్రేషన్ రుసుములు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. నేటి నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. ఇందుకు అనుగుణంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ‘కార్డ్’ సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన మార్పులు చేర్పులు చేశారు.

రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నేటి నుంచి పెరిగిన విలువలు, చార్జీలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. ఇప్పటికే ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకున్న వారు అదనపు రుసుము చెల్లించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. కొత్త రిజిస్ట్రేషన్ చార్జీలను రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

రిజిస్ట్రేషన్ ఫీజును ప్రభుత్వం 6 నుంచి 7.5శాతానికి పెంచింది. తాజా పెంపు ప్రకారం.. ఆస్తుల విక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ చార్జీ 7.5 శాతంగా ఉండగా, గ్రామ పంచాయతీల పరిధిలో ట్రాన్స్‌ఫర్ డ్యూటీ లేకున్నా స్టాంప్ డ్యూటీ 5.5 శాతం, రిజిస్ట్రేషన్ ఫీజు 2 శాతం అమల్లోకి రానున్నాయి.

ఇక, పంచాయతీయేతర ప్రాంతాల్లో స్టాంపు డ్యూటీ 5.5 శాతంగా ఉండగా, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ 1.5 శాతం, రిజిస్ట్రేషన్ రుసుమును 0.5 శాతం వసూలు చేస్తారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు కూడా నేటి నుంచి కొత్త చార్జీలు వసూలు చేయనున్నారు. ఇప్పటికే స్లాటు బుక్ చేసుకున్న వారు 30,891 మంది ఉన్నారు. వీరంతా అదనపు ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. పెరిగిన చార్జీలకు అనుగుణంగా ‘ధరణి’ పోర్టల్‌లోనూ మార్పులు చేశారు. ధరల పెరుగుదల ప్రభావం వారం , పది రోజుల వరకు ఉంటుందని.. దీంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గే అవకాశం ఉందని, అధికారులు అంచనా వేస్తున్నారు.