Telangana Mahalakshmi Scheme: మహాలక్ష్మి స్కీమ్.. త్వరలో చిప్ ఆధారిత స్మార్ట్ కార్డులు

రోజుకు సగటున 35 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. పథకం తర్వాత మహిళా ప్రయాణికుల శాతం 40 శాతం నుంచి 67శాతానికి పెరిగిందన్నారు.

  • Published On : March 29, 2026 / 10:22 PM IST

Telangana Mahalakshmi Scheme: మహాలక్ష్మి పథకానికి సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చారు టీజీఎస్ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి. మహాలక్ష్మి స్కీమ్ సేవల కోసం త్వరలో మహిళలకు చిప్ ఆధారిత స్మార్ట్ కార్డులు ఇస్తామన్నారు. ఈ స్కీమ్ ద్వారా మహిళలకు భారీ లాభం కలుగుతోందని నాగిరెడ్డి వెల్లడించారు. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలు ఆదా చేసుకున్న మొత్తం రూ.10వేల కోట్లు అని తెలిపారు. పథకం ప్రారంభం నుంచి ఇప్పటివరకు 290 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు చేశారని చెప్పారు.

రోజుకు సగటున 35 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. పథకం తర్వాత మహిళా ప్రయాణికుల శాతం 40 శాతం నుంచి 67శాతానికి పెరిగిందన్నారు. నెలకు రూ.1,500 నుంచి 2,500 వరకు ఖర్చు అయ్యే ప్రయాణ వ్యయం ఇప్పుడు మహిళలకు ఆదా అవుతోందన్నారు. ఉచిత టికెట్ల విలువను ప్రభుత్వమే ఆర్టీసీకి రీయింబర్స్‌మెంట్ చేస్తోందన్నారు.

పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు ప్రవేశపెట్టే ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. గ్రామాల నుంచి పట్టణాలకు ఉద్యోగాలు, విద్య, వైద్యం కోసం ప్రయాణం చేసే మహిళల సంఖ్య పెరిగిందన్నారు. మహిళలకు గౌరవప్రదమైన సురక్షిత ప్రయాణం కల్పిస్తున్నామని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి పేర్కొన్నారు.

Also Read: తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతం కట్ .. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వారికి కూడా వర్తింపు