Medaram Jathara 2024 : మేడారం మహాజాతర షురూ.. పోటెత్తిన భక్తజనం..

సమ్మక్క - సారలమ్మ మహా జాతరలో ప్రతి ఘట్టానికి ఒక ప్రత్యేకత ఉంది. అమ్మవార్లకు ప్రీతిపాత్రమైన మాఘ శుద్ధ పౌర్ణమికి ముందు బుధవారంను వన దేవతల వారంగా భావిస్తారు..

Madaram Maha Jatara

Madaram Maha Jatara :  ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నేటి నుండి నాలుగు రోజులపాటు సాగుతుంది. ఒక్కోరోజు ఒక్కో ఘట్టంతో అటవీ ప్రాంతం మార్మోగిపోతుంది. అశేష భక్త జనవాహిని భావోద్వేగ సమ్మేళనం మధ్య సారలమ్మను ఇవాళ గద్దె మీద ప్రతిష్టిస్తారు. అత్యంత రహస్యంగా పూజలు చేశాక.. కన్నేపల్లి నుండి జై సారలమ్మ.. జైజై సారలమ్మ నినాదాల మధ్య సారలమ్మ తల్లి ప్రతిష్ట జరుగుతుంది.

Also Read : Medaram Jatara 2024 : మేడారం జాతరకు వెళ్లే భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్..

సమ్మక్క – సారలమ్మ మహా జాతరలో ప్రతి ఘట్టానికి ఒక ప్రత్యేకత ఉంది. అమ్మవార్లకు ప్రీతిపాత్రమైన మాఘ శుద్ధ పౌర్ణమికి ముందు బుధవారంను వన దేవతల వారంగా భావిస్తారు.. ఇవాళ మేడారం, కన్నెపల్లి, కొండాయి, పూనుగొండ్లలో జాతరకు శ్రీకారం జరుగుతుంది. నాలుగు ప్రాంతాల్లోనూ వన దేవత పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో జాతర లాంఛనంగా మొదలవుతుంది. మహా జాతరకు సరిగ్గా వారం ముందు జరిగే ఈ పూజా కార్యక్రమాలను మండమెలిగె పేరుతో పిలుస్తారు. మండమెలిగె పూర్తయితే జాతర మొదలైనట్లేనని ఆదివాసీలు భావిస్తారు. ఈ రోజు నుంచి ఆదివాసీల ఇళ్లకు బంధువులు వస్తారు. జాతర ఇవాళ్టి నుండి 24 వరకు జరుగుతుంది.

Also Read : Medaram Jatara 2024: సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే రూ.75 కోట్ల నిధులు మంజూరు చేశారు: మంత్రి సీతక్క

  • జాతర విశేషాలు ..
    ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం జాతరకు పేరుంది.
    రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు ప్రతిసారీ కోట్లాది సంఖ్యలోభక్తులు హాజరు అవుతుంటారు.
    ఈసారి ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.
    మేడారం జాతరలో ప్రధానంగా నాలుగు రోజులు నాలుగు ఘట్టాలు ఉంటాయి.
    కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకురావడంతో జాతర ఊపందుకుంటుంది.
    సారలమ్మను ఇవాళ సాయంత్రం జంపన్నవాగు మీదుగా మేడారంలోని గద్దెల వద్దకు తీసుకువస్తారు.
    సారలమ్మ గద్దె పైకి రాకముందే ఏటూరునాగారం మండలంలోని కొండాయి నుంచి గోవిందరాజును, మహబూబాబాద్ జిల్లాలోని పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును కాలినడకన మేడారం తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు.
    జాతర సందర్భంగా సమ్మక్క, పగిడిద్దరాజులకు ఆదివాసీ సంప్రదాయం ప్రకారం వివాహం జరిపిస్తారు.
    జాతరకు ఒక రోజు ముందు అంటే మంగళవారం పగిడిద్దరాజును ఆయన స్వస్థలమైన పూనుగొండ్లలో పెళ్లికొడుకుగా తయారుచేసి వేడుకను నిర్వహించారు.
    బుధవారం మధ్యాహ్నం వరకు వడ్డె ఇంటి నుంచి పసుపు, కుంకుమ, కొత్త బట్టలతో పగిడిద్దరాజు మేడారం ఆలయానికి చేరుకుంటారు.
    బయల్దేరే ముందు యాటను బలిచ్చి, ఆదివాసీ సంప్రదాయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
    నిన్న (మంగళవారం) రాత్రి తాడ్వాయి మండలం లక్ష్మీపురం గ్రామానికి చేరుకుని అక్కడ పెనక వంశీయుల ఇంటిలో బస చేసిన పగిడిద్దరాజు ఇవాళ సాయంత్రం గద్దెలపై ప్రతిష్టించబడతారు.

 

  • నాలుగు రోజులే కీలకమైనవి.
    బుధవారం జాతర ప్రారంభం అవుతుంది. మొదటిరోజు కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెపైకి చేరుతుంది. రాత్రి పూనుగొండ్ల నుంచి మేడారానికి చేరుకున్న పగిడిద్ద రాజు, కొండాయి నుంచి గోవిందరాజులు గద్దెలపైకి చేరుకుంటారు. దీంతో మహాజాతర లాంఛనంగా ప్రారంభం అవుతుంది.
    రెండో రోజు గురువారం చిలకలగుట్టపై నుంచి సమ్మక్కను ప్రభుత్వ లాంఛనాలతో గద్దెపైకి తీసుకొస్తారు. సమ్మక్క గద్దెలపైకి చేరటంతో జాతర పతాక స్థాయికి చేరుకుంటుంది.
    మూడో రోజు శుక్రవారం గిరిజనుల ఆరాధ్యదైవాలైన సారలమ్మ, సమ్మక్కలు గద్దెపైకి చేరటంతో శుక్రవారం తల్లులకు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తారు.
    నాలుగో రోజు శనివారం గద్దెలపై ఉన్న తల్లులకు మొక్కులు అనంతరం సాయంత్రం 6 గంటల తర్వాత సమ్మక్క చిలుకలగుట్టకు, సారలమ్మ కన్నెపల్లికి, పగిడిద్ద రాజు పూనుగొండ్లకు, గోవిందరాజులు కొండాయికి తిరుగు పయనం అవుతారు. దీంతో మేడారం మహాజాతర ముగుస్తుంది.
    మేడారం మహాజాతరకు వచ్చే భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తారు.
    జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసిన తర్వాతే తల్లుల దర్శనానికి వెళ్లటం సంప్రదాయంగా వస్తోంది.
    మేడారంలోని జంపన్నవాగుపై ఉన్న జోడు వంతెనల నుంచి 10 కిలో మీటర్ల వరకు భక్తులతో జంపన్నవాగు జనసముద్రం అవుతుంది.
    మేడారం, నార్లాపూర్‌, ఊరట్టం, కన్నెపల్లి, కాల్వపల్లి, రెడ్డిగూడెం ప్రాంతాలన్నికూడా జంపన్నవాగు సమీపంలో ఉండటంతో ఇక్కడ పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు క్యూ కడతారు.
    ఇసుక వేస్తే రాలనంతగా జనంతో జంపన్నవాగు ప్రయాగ్‌రాజ్‌లోని గంగ, యమున నదుల్లో జరిగే కుంభమేళాను తలపిస్తుంది. దీంతో తెలంగాణ కుంభమేళాగా మేడారం జాతరను పిలుస్తున్నారు.
    ఒక గిరిజన జాతరకు కోట్లాది మంది భక్తులు రావటం కూడా ప్రపంచంలోనే అరుదైన జాతరగా గుర్తింపు పొందుతోంది మేడారం జాతర.
    ఈనెల 23న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడారం వచ్చి అమ్మలను దర్శించుకుంటారు. గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి కూడా అదేరోజు మేడారానికి విచ్చేసి అమ్మలను దర్శించుకోనున్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు