Rain Alert in Telangana
Rain Alert to Telangana : నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాగల 24 గంటల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సౌత్, వెస్ట్ జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. వికారాబాద్, నారాయణ పేట, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, రంగారెడ్డిజిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. జీహెచ్ ఎంసీతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో సైతం వర్ష కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Also Read : తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడి మార్పుపై జోరుగా చర్చ.. అధిష్టానం పరిశీలనలో ఆ ఇద్దరి పేర్లు!
వర్షాకాలం సీజన్ కంటే ముందు, ప్రారంభమైన తరువాత పలు సందర్భాల్లో ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో 8 నుంచి 10 సెంటీమీటర్ల వర్షం గంట వ్యవధిలో కురిసిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జీహెచ్ ఎంసీలో వర్షం పడిన సమయంలో రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తుంటంతో చెట్లు విరిగి విద్యుత్ కు అంతరాయం ఏర్పడుతుంది. ప్రస్తుతం వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.