hyderabad metro
Ganesh Immersion 2024: గణేశ్ ఉత్సవాల్లో చివరి అంకమైన గణనాథుల నిమజ్జనోత్సవ కార్యక్రమం ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ యంత్రాంగం ప్రతిష్ట ఏర్పాట్లు చేసింది. విగ్రహాల ఊరేగింపు, ట్రాఫిక్, శాంతిభద్రతల నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించారు. ముఖ్యంగా ట్రాంక్ బండ్ పై వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనోత్సవ కార్యక్రమం 17వ తేదీ (మంగళవారం) జరగనుంది. గణనాథుల నిమజ్జనోత్సవ కార్యక్రమం నేపథ్యంలో ఈనెల 17న గ్రేటర్ ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీస్సులు నడుపుతున్నట్లు తెలిపింది. ఎన్టీఆర్ ఘాట్, హెస్సేన్ సాగర్, నెక్లెస్ రోడ్డుకు నిమజ్జనానికి వెళ్లే వారు ఈ ప్రత్యేక బస్సులను వినియోగించుకోవచ్చు.
Also Read : గణేశ్ నిమజ్జనం వేళ హైదరాబాద్ ట్యాంక్బండ్పై ఉద్రిక్తత.. బారికేడ్లు, ప్లెక్సీలను తొలగింపు
వినాయక నిమజ్జనాలు జరిగే మంగళవారం రోజు అర్థరాత్రి 1గంట వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉండనున్నాయి. చివరి స్టేషన్ల నుంచి అర్థరాత్రి 1గంటకు బయలుదేరి.. గమ్యస్థానానికి రెండు గంటల వరకు చేరుకుంటాయి. నిమజ్జనం ముగిసే వరకు అవసరాన్ని బట్టి రద్దీ వేళల్లో అదనపు మెట్రో ట్రిప్పులు నడపనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
Also Read : Mini Moon Earth : మన భూమికి ‘మినీ చంద్రుడు’ వస్తున్నాడు.. 2 నెలలు మనచుట్టే తిరుగుతాడు!
వినాయక నిమజ్జనాలు జరిగే 17వ తేదీ (మంగళవారం) రాచకొండ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశిస్తూ కమిషనర్ సుదీర్ బాబు నోటిఫికేషన్ జారీ చేశారు. 17వ తేదీ ఉదయం 6గంటల నుంచి 18వ తేదీ సాయంత్రం 6గంటల వరకు మద్యం, కల్లు దుకాణాలు, బార్లు మూసేయాలని స్పష్టం చేశారు. ఇదిలాఉంటే.. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు శని, ఆదివారాల్లో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆదివారం అర్థరాత్రి 12గంటల వరకు మహాగణపతి దర్శనానికి నిర్వాహకులు భక్తులకు అనుమతి ఇచ్చారు. ఆ తరువాత దర్శనం నిలిపివేశారు. మంగళవానం నిమజ్జన కార్యక్రమం ఉండటంతో సోమవారం ఆ ఏర్పాట్లను నిర్వాహకులు చేసుకోనున్నారు.