Kumuram Bheem Asifabad : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాల, బెజ్జూర్, చింతలమానెపల్లి మండలాల్లోని పలు మండలాల్లో మంగళవారం ఉదయం భూప్రకంపనలు కలకలం రేపాయి. ఒక్క క్షణం పాటు భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ప్రాణహిత నదీ పరీవాహక ప్రాంతంలో ఈ భూప్రకంపనలకు కేంద్రం కావచ్చని అధికారులు అంటున్నారు. స్వల్పంగా కంపించడం వల్ల ఎటువంటి ప్రమాదం లేదని అధికారులు చెప్పారు. అలాగే ఈ మండలాలకు ఆనుకొని ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో కూడా భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు.
మంగళవారం ఉదయం 8 గంటల 43 నిమిషాల సమయంలో భూమి కంపించింది. పలు ఇళ్లలో వస్తువులు చిందరవందరగా పడిపోయాయి. భూప్రకంపనల సమయంలో శబ్దాలు వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. స్కూల్లో విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. విద్యార్థులను స్కూల్ బిల్డింగ్ లో కాకుండా.. బయట గ్రౌండ్ లో కూర్చోబెట్టి పాఠాలు చెప్పారు టీచర్లు.