MLA Rajasingh suspension..Jagdish's sensational comments
MLA Rajasingh suspension : తెలంగాణ మంత్రి జగదీశ్రెడ్డి కేంద్రంలో ఉన్న బీజేపీపై మరోసారి మండిపడ్డారు. ఎమ్మెల్యే రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయటం పెద్ద డ్రామా అంటూ ఆరోపించారు. తెలంగాణ బీజేపీ నేతల కుట్రల వెనక కేంద్రం పెద్దల హస్తం ఉంది..కేంద్ర నాయకత్వమే రాజాసింగ్ తో వివాదాస్పద వ్యాఖ్యలు చేయించి పైకి మాత్రం రాజాసింగ్ ను సస్పెండ్ చేసినట్లుగా డ్రామాలాడుతున్నారు అంటూ ఆరోపించారు. ఈ డ్రామాలు అన్నీ బీజేపీ వికృతరూపాలేనంటూ వ్యాఖ్యలు చేశారు మంత్రి జగదీశ్ రెడ్డి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించటమే బీజేపీ లక్ష్యమని ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో మత విధ్వేషాలు పుట్టించటమే కాషాయ పార్టీ పనిగా పెట్టుందని విమర్శించారు. బెంగాల్ తరహా రాజకీయాలు తెలంగాణలో చెల్లవు అంటూ బీజేపీకి కౌంటర్ ఇచ్చారు మంత్రి.
తెలంగాణాలో శాంతిభద్రతల సమతుల్యం దెబ్బతీసి సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని అడ్డుకుట్ర జరుగుతోందన్నారు. చట్టబద్ధ సంస్థలు ఎలాంటి ఆరోపణలు చేయకున్నా బీజేపీ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కావాలని రెచ్చగొట్టి ప్రతిదాడులు చేసేలా రెచ్చగొట్టి.. శాంతిభద్రతలకు భంగం కలిగించాలని చూస్తున్నారంటూ మంత్రి ఆరోపించారు. బీజేపీ జాతీయ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే తెలంగాణాలో బీజేపీ నాయకులు చేస్తున్నారని ప్రజల మధ్య అలజడులు సృష్టిస్తున్నారని అన్నారు.
ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి.. కులాల మధ్య బీజేపీ కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ లక్ష్యాన్ని అడ్డుకోలేరని స్పష్టంచేశారు. రాజా సింగ్ సస్పెన్షన్ ఒక డ్రామా అని..కేంద్ర నాయకులు పథకం ప్రకారం రాజాసింగ్ తో వ్యాఖ్యలు చేయించి సస్పెన్షన్ చేసినట్లు నటిస్తున్నారన్నారని అన్నారు. బీజేపీ కుట్రలపై ప్రజలు, ప్రజాస్వామ్య వాదులు అప్రమత్తంగా ఉండాలన్నారు. దాడులే లక్ష్యంగా చేసుకుంటే టీఆర్ఎస్ ఎదుట బీజేపీ నిలువలేదన్నారు.