Jupally Krishna Rao: మీ ఆఫీసుకొస్తా.. తేల్చుకుందామా.? కేటీఆర్ కు జూపల్లి సవాల్
తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణా రావు(Jupally Krishna Rao) కేటీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
- V Santhosh Kumar
- Published on- July 1, 2026 / 07:20 PM IST
Minister Jupally Krishna Rao challenges to KTR
- బీఆర్ఎస్ పాలనపై జూపల్లి ధ్వజం.
- ఎనిమిది లక్షల కోట్ల అప్పులు.
- తప్పుంటే రాజీనామాకు మంత్రి సవాల్.
Jupally Krishna Rao: తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణా రావు కేటీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన పాత ముచ్చట్లు చెబుతూ కాలక్షేపం చేస్తున్నారని, ప్రస్తుత ప్రభుత్వం 50 శాతం పదవీకాలం ముగిసినా ఏమీ చేయలేదనడం హాస్యాస్పదమని మండిపడ్డారు. తెలంగాణ త్యాగాలతో ఏర్పడిన రాష్ట్రమని, నాడు మిగులు బడ్జెట్తో ఉన్న ధనిక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పదేళ్ల పరిపాలనలో ఏకంగా 8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టేసిందని ఆయన ఆరోపించారు. తాము చేసింది 3 లక్షల కోట్ల అప్పు మాత్రమేనని కేటీఆర్ చెప్పడం శుద్ధ అబద్ధమని కొట్టిపారేశారు.
Hindu Marriage: అలాంటి పెళ్లి చెల్లదు.. రిజిస్ట్రేషన్ ఒక్కటే సరిపోదు.. గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు
కేసీఆర్, కేటీఆర్(Jupally Krishna Rao)ల నిర్వాకం వల్లనే రాష్ట్ర ఖజానాకు చిల్లు పడిందని జూపల్లి విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో తెచ్చిన రెండు లక్షల కోట్ల అప్పుతో పాటు, ఇరిగేషన్ కార్పొరేషన్, మిషన్ భగీరథ కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన దాదాపు 40 వేల కోట్ల రూపాయల అప్పులను ఇప్పుడు ఎవరు కట్టాలని ఆయన ప్రశ్నించారు. ఈ అప్పుల భారాన్ని ప్రజలపై వేసి, ఇప్పుడు మళ్లీ సవాళ్లు విసరడం సిగ్గుచేటన్నారు. తాను చెబుతున్న అప్పుల లెక్కలు తప్పని నిరూపిస్తే, ఈ రోజే తన స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖను సమర్పిస్తానని మంత్రి జూపల్లి సవాల్ విసిరారు.
ప్రజలు బీఆర్ఎస్ అరాచకాలను, అప్పులను గమనించే వారిని గద్దె దించారని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ అని, తామే తెచ్చామని చెప్పుకోవడం బీఆర్ఎస్ నేతల భ్రమ అని కొట్టిపారేశారు. నాడు కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా తెలంగాణ ఏర్పాటును ఆలస్యం చేసిందని, కేవలం ప్రజల ఉద్యమాల వల్లే రాష్ట్రం సిద్ధించిందని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఇప్పటికే 20 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసి రైతులను ఆదుకుందని జూపల్లి కృష్ణా రావు ఈ సందర్భంగా గుర్తుచేశారు.
