KTR in tribal entrepreneurs conference : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి కేటీఆర్ కూడా దూకుడు పెంచారు. ఓటర్లను ఆకట్టుకునే భాగంలో ప్రతిపక్షాలమీద విమర్శలతో పాటు బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి జరిగిందని చెబుతున్నారు. భాగంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తు నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. తాజాగా హైదరాబాద్ గిరిజన పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..సీఎం కేసీఆర్ రాజకీయాల్లో ఓటమి ఎరుగని నేత అని ఆయన 1985 నుంచి ఓటమి అనేది తెలియని వ్యక్తి అని తెలిపారు. అటువంటి కేసీఆర్ మరోసారి ఎన్నికల్లో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తంచేశారు. 1985 నుంచి 2023 వరకు ఒక్కసారి కూడా ఓడిపోని ఆయన ఈ ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తారని అన్నారు.
ఎదురు దెబ్బలు అనేవి జీవితంలో అందరికి తగులుతాయి…కానీ వాటిని తట్టుకుని నిలబడితేనే గెలుపు వరిస్తుందన్నారు. అటువంటి ఓటములు గెలుపుకు తొలి మెట్టు అని ముందుకు సాగితే విజయం తప్పకుండా వస్తుందని సూచించారు. అవకాశాలను అందిపుచ్చుకుంటు ముందుకెళ్లిపోవాలని గిరిజన పారిశ్రామిక వేత్తలకు సూచించారు. కులాలు దేవుడు పుట్టించినవి కాదని గెలుపుకు కులం అవసరం లేదన్నారు. కృషి, పట్టుదల ఉంటే దేనిలో అయినా విజయం సాధించవచ్చని దానికి సీఎం కేసీఆర్ ఓ ఉదాహరణ అన్నారు. తెలివితేటలు అందరికి ఉంటాయి కానీ అంది వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవటంలో వాటిని చూపించాలన్నారు.
వ్యాపారంలో పోటీ ఉండాలని అలాంటప్పుడే విజయాలు సాధించగలుగుతామన్నారు. వ్యాపారంలో విజయం సాధించినవారిని స్ఫూర్తిగా తీసుకోవాలని ఈరోజు స్టార్టప్ లుగా మొదలైనవారు రేపు రాబోయేవారికి స్ఫూర్తిగా నిలవాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యాపారులకు మంచి ప్రోత్సాహకాలు అందిస్తోంది అంటూ ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.