Minister Talasani Srinivas Yadav: ఆ బాలుడి కుటుంబాన్ని ఆదుకుంటాం : మంత్రి తలసాని
ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, వీధి కుక్కల వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపడుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.
- Harishth Thanniru
- Published On : February 23, 2023 / 02:44 PM IST
Minister Thalasani
Minister Talasani Srinivas Yadav: వీధి కుక్కల దాడి ఘటనలో నాలుగు సంవత్సరాల బాలుడు మరణించటం బాధాకరమని, ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మాసబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో జీహెచ్ఎంసీ, వెటర్నరీ అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. ఇటీవల అంబర్పేట కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మరణించిన ఘటనపై, నగరంలో వీధి కుక్కల కాటు ఘటనలపై, కుక్కల దాడుల నియంత్రణ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. నగరంలో వీధి కుక్కలు ఎక్కువ మొత్తంలో ఉన్నాయని, ముఖ్యంగా మాంసం దుకాణాల వద్ద, మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా సంచరిస్తున్నాయని అన్నారు. మటన్, చికెన్ షాపుల వద్ద ఉదయం, రాత్రి వేళల్లోనూ స్పెషల్ డ్రైవ్స్ పెడతామని మంత్రి తెలిపారు.
ప్రస్తుతం వీధి కుక్కల బెడదను తగ్గించే విషయంలో ప్రత్యేక టీంలు, టోల్ ఫ్రీం నెంబర్, ప్రత్యేక యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చునని మంత్రి తెలిపారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, వీధి కుక్కల వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపడుతుందని మంత్రి చెప్పారు. కుక్కలకు స్టెరిలైజేషన్ చేస్తున్నామని, అందుకోసం కొత్త టెక్నాలజీని వాడుతున్నామని అన్నారు. నగర మేయర్ మాట్లాడిన మాటలు వక్రీకరించారని తలసాని అన్నారు. స్వచ్ఛంద సంస్థలకు ఏమైనా అనుమానాలు ఉంటే మమ్మల్ని సంప్రదించాలని తలసాని తెలిపారు. జంతు ప్రేమికులు రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటే ఇబ్బందికర పరిణామాలు వస్తాయని మంత్రి తలసాని అన్నారు.
Dogs Attack Boy Died : హైదరాబాద్ అంబర్ పేటలో దారుణం.. వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి
నగరంలోని అంబర్పేట్లో వీధి కుక్కలు నాలుగేళ్ల చిన్నారిపై దాడిచేసిన విషయం విధితమే. ఈ కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన నాలుగేళ్ల బాలుడు మరణించాడు. కుక్కలు బాలుడిపై దాడిచేసి గాయపర్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ప్రభుత్వం ఈఘటనను సీరియస్ గా తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా భాగ్యనగరంలో వీధి కుక్కల దాడులు, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిసారించింది.
