Hyd Fire Accident: ప్రమాదం బాధాకరం.. మృతుల కుటుంబాలను ఆదుకుంటాం: మంత్రి తలసాని
సికింద్రాబాద్ బోయిగూడలోని స్క్రాప్ గోడౌన్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. ఇది బాధాకరమైన సంఘటన అన్నారు.
- Ravikanth 10tv
- Published On : March 23, 2022 / 08:50 AM IST
Talasani
Hyd Fire Accident: సికింద్రాబాద్ బోయిగూడలోని స్క్రాప్ గోడౌన్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. ఇది బాధాకరమైన సంఘటన అన్నారు. ఘటనా స్థలాన్ని ఆయన సందర్శించారు. అర్థరాత్రి దాటిన తర్వాత మంటలు అంటుకున్నాయని.. వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బంది స్పందించి చర్యలు తీసుకున్నారని మంత్రి చెప్పారు.
ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బంది ఎంతగా ప్రయత్నించినా.. 11 మంది ప్రాణాలు కోల్పోవడం విచారకరమన్నారు. సిబ్బంది కూడా చాలావరకూ శ్రమించిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. ఘటన జరిగిన తీరుపై ప్రభుత్వ పరంగా విచారణ చేసి.. కారణాలు తెలుసుకుంటామన్నారు. చనిపోయిన వారి కుటుంబీకులకు ఆయన సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థించారు.
ప్రమాదం జరిగిన స్థలానికి పరిసరాల్లో చాలా వరకూ స్క్రాప్ గోడౌన్స్ ఉన్నాయని మంత్రి చెప్పారు. అన్ని విషయాలను విచారణలో గుర్తించి.. పూర్తి వివరాలు చెబుతామన్నారు. బాధితులకు తగిన విధంగా ఆర్థిక సహాయాన్ని అందిస్తామని చెప్పారు. నగరంలోని మిగిలిన స్క్రాప్ గోడౌన్లను సంబంధిత అధికారులు తనిఖీ చేస్తారని.. అనుమతులు పరిశీలిస్తారని.. నిబంధనల ప్రకారం ఉన్నాయో లేదో చూస్తామని తెలిపారు. ఘటనాస్థలాన్ని సందర్శించిన మంత్రికి.. ప్రమాదం జరిగిన తీరును అధికారులు వివరించారు.
ఇక.. మంగళవారం అర్థరాత్రి (తెల్లవారితే బుధవారం) 2 గంటలకు.. సికింద్రాబాద్ సమీపంలో ఉన్న బోయిగూడలోని స్క్రాప్ గోడౌన్ లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు అంటుకున్నాయి. ఈ ఘోర విషాదంలో 11 మంది సజీవ దహనం కాగా.. మరో వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతులను బిహార్ కు చెందిన కార్మికులుగా గుర్తించారు.
Read More:
Fire Accident: బోయిగూడలో భారీ అగ్ని ప్రమాదం, 11 మంది సజీవ దహనం
