surabhi vani devi : తాము నేర్పిన చదువు ఇదేనా ? పట్టభద్రుల ఎన్నికల్లో చెల్లని ఓట్లపై టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి అసహనం వ్యక్తం చేశారు. పట్టభద్రులు కూడా ఓటు సరిగ్గా వేయకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సరూర్ నగర్ లో కౌంటింగ్ కేంద్రంలో సిబ్బంది పోలైన ఓట్లను లెక్కిస్తున్నారు. కౌంటింగ్ సరళిని పరిశీలించడానికి సురభి వాణీదేవి అక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ… కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోందని, గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ పార్టీ..సురభి వాణీదేవిని బరిలో దింపారు. దివంగత ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె అయిన..ఈమె..విద్యావేత్తగా పేరొందారు. ఇక ఎన్నికల విషయానికి వస్తే…ఈసారి 67 శాతం ఓటింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన ఓట్లను సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో లెక్కిస్తున్నారు. దాదాపు 93 మంది అభ్యర్థులు పోటీ పడడంతో కౌంటింగ్ ప్రక్రియకు చాలా ఆలస్యం జరుగుతోంది.
పోలింగ్ శాతం పెరగడం కూడా మరొక కారణంగా చెప్పవచ్చు. ఓట్ల లెక్కింపు ప్రాధాన్యత క్రమంలో జరుగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఎవరికీ కోటా ( చెల్లుబాటయ్యే మొత్తం ఓట్లలో సగం కంటే ఒక ఓటు ఎక్కువ) ఓట్లు రాకుంటే, కోటా ఓట్లు వచ్చేంత వరకు తర్వాతి ప్రాధాన్యత ఓట్లను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రస్తుతం ఏడో రౌండ్ పూర్తయ్యే సరికి వాణీ దేవి 1, 12, 689 ఓట్లు పొందినట్లు సమాచారం.