ఈ ఆలోచన కూడా ప్రభుత్వానికి లేకపోవడం దారుణం: ఎమ్మెల్సీ కవిత

సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గతంలో కేవలం 19 బీసీ సంక్షేమ పాఠశాలలను ఏర్పాటు చేసిందని అన్నారు.

కేసీఆర్ హయాంలో సగటున ఏడాదికి 27 బీసీ గురుకుల పాఠశాలలు ఏర్పాటయ్యాయని బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అన్నారు. శాసన మండలిలో కవిత ఇవాళ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క బీసీ గురుకుల పాఠశాల కూడా ఏర్పాటు చేయలేదని తెలిపారు. కనీసం ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి లేకపోవడం దారుణమని కవిత చెప్పారు.

సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గతంలో కేవలం 19 బీసీ సంక్షేమ పాఠశాలలను ఏర్పాటు చేసిందని అన్నారు. పదేళ్లలో కేసీఆర్ 275 బీసీ పాఠశాలలను, 31 బీసీ డిగ్రీ కాలేజీలను, ప్రత్యేకంగా బీసీలకు రెండు వ్యవసాయ కాలేజీలను ఏర్పాటు చేశారని తెలిపారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు ఫీజు రియింబర్స్‌మెంట్ కింద రూ.14 వేల కోట్లు విడుదల చేసిందని కవిత అన్నారు. 2,230 బీసీ విద్యార్థుల విదేశీ విద్యకు రూ. 450 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. నెలకు రెండుమూడు సార్లు ఢిల్లీకి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిశారని, మరి ప్రతి జిల్లాకు రావాల్సిన నవోదయా విద్యాలయాలను ఎన్ని సాధించారని నిలదీశారు.

వెనుకబడిన జిల్లాలకు నిధులు సాధించారా? అని కవిత అన్నారు. ఇన్ని సార్లు ఢిల్లీ వెళ్లడమే కాకుండా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి అదనపు నిధులు ఏం తీసుకొచ్చారని ప్రశ్నించారు.

Jamili Elections Bill: రేపు పార్లమెంటు ముందుకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు