Errolla Srinivas : బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు..
ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారెంటీలు అటకెక్కించి ఏడో గ్యారెంటీగా ఎమర్జెన్సీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని కేటీఆర్ విరుచుకుపడ్డారు.
- Naveen
- Published On : December 26, 2024 / 05:25 PM IST
Errolla Srinivas
Errolla Srinivas : బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ సమయంలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించారంటూ ఎర్రోళ్ల శ్రీనివాస్ పై కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
కాగా, ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ ను బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. శ్రీనివాస్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఇది దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ సర్కార్ పై ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో దళిత, బహుజన వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం బీఆర్ఎస్ తరపున ప్రశ్నిస్తున్నందుకే ఎర్రోళ్లపై కక్ష కట్టి వేధించాలని చూస్తున్నారని రేవంత్ సర్కార్ పై ఫైర్ అయ్యారు కేటీఆర్.
సీఎం రేవంత్ రెడ్డి ఏడో గ్యారెంటీగా ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారు..
కనీసం నోటీసులు ఇవ్వకుండా శ్రీనివాస్ కుటుంబసభ్యులను భయబ్రాంతులకు గురి చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారెంటీలు అటకెక్కించి ఏడో గ్యారెంటీగా ఎమర్జెన్సీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని కేటీఆర్ విరుచుకుపడ్డారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక అణిచివేతతో బీఆర్ఎస్ గొంతు నొక్కేందుకు విఫలయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కు కేసులు కొత్త కాదన్నారు కేటీఆర్. అరెస్టులను లెక్క చేయబోమని కౌంటర్ ఇచ్చారు.
అటు మాసబ్ ట్యాంకు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎర్రోళ్ల శ్రీనివాస్ ను పరామర్శించారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఆయన వెంట ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, బండారు లక్ష్మారెడ్డి, మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వ అక్రమ కేసులకు భయపడబోమని హరీశ్ రావు తేల్చి చెప్పారు.
Brs Leader Errolla Srinivas
Also Read : చెరువులో దూకి ఎస్సై, మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ బలవన్మరణం
ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ ఎపిసోడ్ లో నాటకీయ పరిణామాలు..
ఈ ఉదయం నుంచి కూడా ఎర్రోళ్ల శ్రీనివాస్ వ్యవహారంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెల్లవారుజామునే ఎర్రోళ్ల శ్రీనివాస్ ఇంటికి చేరుకున్న పోలీసులు.. ఆయనను అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటూ ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గతంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. పాడి కౌశిక్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా స్టేషన్ కు వెళ్లారు. ఆ వ్యవహారంలో పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఎర్రోళ్ల శ్రీనివాస్ ను అరెస్ట్ చేయడం జరిగింది.
Also Read : బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్.. మండిపడ్డ హరీశ్ రావు
