Drunk and Drive: డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడ్డ వాహనదారులకు ఊరట
హైదరాబాద్ మహానగర పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పోలీసులకు చిక్కిన వాహనదారులకు ఊరట కలిగించేలా నాంపల్లి స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్ట్ తీర్పు వెలువరించింది.
- Bharath Reddy
- Published On : February 23, 2022 / 11:41 AM IST
Drunk And Drive
Drunk and Drive: హైదరాబాద్ మహానగర పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పోలీసులకు చిక్కిన వాహనదారులకు ఊరట కలిగించేలా నాంపల్లి స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్ట్ తీర్పు వెలువరించింది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుపడిన వాహనాదారులకు రూ. 2,100 ఫైన్ కట్టించుకుని వదిలేయాలంటూ కోర్టు పోలీసులకు సూచించింది. హైదరాబాద్ మహానగర పరిధిలో వివిధ సందర్భాల్లో నిర్వహించిన వాహన తనిఖీల్లో వేల మంది వాహనదారులు మద్యం సేవించి పట్టుబడ్డారు. అప్పటికప్పుడు పోలీసులు ఫైన్ విధించినా కట్టలేని పరిస్థితుల్లో కొందరు వాహనాలను వదిలి వెళ్లారు వాహనదారులు. అలా 2018 నుంచి ఈ ఏడాది ఆరంభం వరకు జంట నగరాల పరిధిలోనే 28, 938 పెండింగ్ చాలన్లు ఉన్నట్లు గుర్తించిన పోలీస్ శాఖ.. ఆ కేసుల పరిష్కారం దిశగా అడుగులు వేసింది. అందులో భాగంగా స్పెషల్ లోక్ అదాలత్ ఏర్పాటు చేసి పెండింగ్ కేసులను పరిష్కరించాలని భావించారు.
ట్రాఫిక్ పోలీసులు, న్యాయశాఖ అధికారుల సమన్వయంతో లోక్ అదాలత్ ఏర్పాటు చేసి వాహనదారులకు ఊరట కలిగేలా నిర్ణయం తీసుకున్నారు. ఇక పెండింగ్ చలాన్ల విషయమై కోర్టు.. ఫిబ్రవరి 19 నుండి మార్చి 12 వరకు ఫైన్ కట్టుకునే అవకాశం కల్పించడంతో నాంపల్లి లోక్ అదాలత్ వద్ద వందలాది మంది వాహనదారులు క్యూ కడుతున్నారు. నాలుగు రోజుల్లో సుమారు 5 వేల మంది కోర్టుకు హాజరై.. జరిమానా కట్టి తమ వాహనాలను విడిపించుకున్నారు. గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుపడితే రూ.10,500 ఫైన్ తో పాటు జైలు శిక్ష కూడా విధించేవారు. అయితే పట్టుబడిన వాహనదారుల్లో ఎక్కువమంది సామాన్యులే ఉండడంతో వారికి ఊరట కలిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. లేబర్ వర్క్స్, ఆటో డ్రైవర్లకు మరింత ఊరట కలిగినట్లైంది. ఫైన్ తగ్గించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్న వాహనాదారులు.. చకచకా డబ్బు కట్టి వాహనాలను విడిపించుకు వెళ్తున్నారు.
Also read: CM KCR : నేడు మల్లన్నసాగర్ ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
