Nizamabad Bride Suicide Case : నిజామాబాద్ జిల్లాలో సంచలనం రేపిన నవవధువు రవళి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించాడు వరుడు సంతోష్. తన వేధింపుల వల్లే రవళి సూసైడ్ చేసుకుందన్న ఆరోపణల్లో నిజం లేదన్నాడు సంతోష్.
తనసలు రవళిని వేధించలేదంటున్నాడు సంతోష్. పెళ్లి తర్వాత ఉద్యోగం చేయాలని తాను రవళికి చెప్పింది నిజమేనని, దానికి ఆమె కూడా ఒప్పుకుందని సంతోష్ తెలిపాడు. ఆత్మహత్యకు ముందు రోజు రాత్రి రవళితో మాట్లాడింది కూడా నిజమే అన్నాడు సంతోష్. అయితే, అదనపు కట్నం కోసం తాను రవళి, ఆమె కుటుంబసభ్యులను వేధించలేదని చెబుతున్నాడు. వాళ్లు ఎంత కట్నం ఇస్తే అంతే తీసుకుంటానని చెప్పానంటున్నాడు సంతోష్. రవళి ఇలా ఆత్మహత్య చేసుకుంటుందని తాను ఊహించలేదన్నాడు. తనపై వస్తున్న ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమేనని పెళ్లికొడుకు సంతోష్ తేల్చి చెప్పాడు.
అసలేం జరిగిందంటే..
పెళ్లి మండపంలో పెను విషాదం చోటు చేసుకుంది. కొన్ని గంటల్లో వరుడితో తాళి కట్టించుకోవాల్సిన పెళ్లి కూతురు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. నిజామాబాద్ జిల్లా నవీపేటలో ర్యాగల రవళి (26), సంతోష్ పెళ్లి ఆదివారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఓ ఫంక్షన్ హాల్ లో జరగాల్సి ఉంది. శనివారం రాత్రి జరిగిన మెహెందీ ఫంక్షన్ లో కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి రవళి ఎంతో హ్యాపీగా డ్యాన్స్ కూడా చేసింది. ఉదయం అంతా పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉండగా.. రవళి ఇంట్లో తన గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. ఎంతకూ తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన తండ్రి, కుటుంబసభ్యులు తలుపులు బద్దలు కొట్టారు.
గదిలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకున్న రవళిని కనిపించింది. దీంతో వారు షాక్ తిన్నారు. కన్యాదానం చేసి అత్తారింటికి పంపాల్సిన తమ కూతురిని కాటికి సాగనంపాల్సిన పరిస్థితి రావటంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, పెళ్లి కొడుకు సంతోషన్ వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని రవళి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పెళ్లి తర్వాత ఉద్యోగం చేయాలని చెప్పడంతో పాటు పలు విషయాల్లో మానసికంగా వేధింపులకు గురి చేశాడని వాపోయారు. రవళిని పెళ్లొ కొడుకు సంతోష్ ఆత్మహత్యకు ప్రేరేపించాడని వధువు తండ్రి ఆరోపించారు. దీంతో పోలీసులు వరుడితో పాటు ఆయన కుటుంబసభ్యులపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు జరుపుతున్నారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.
పెళ్లికి ముందే వరుడు సంతోష్ సూటిపోటి మాటలతో రవళిని వేధించాడని, ఆస్తిలో సగం వాటా కావాలని డిమాండ్ చేశాడని యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెళ్లి కుదిరినప్పటి నుంచి ఉద్యోగం చేయాలని వేధించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాబోయే పెళ్లి కొడుకు శనివారం రాత్రి తమ కూతురికి ఫోన్ చేశాడని.. అతడు పెట్టిన మానసిక క్షోభతోనే రవళి ఆత్మహత్యకు పాల్పడిందని ఫిర్యాదులో ప్రస్తావించాడు తండ్రి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని యువతి కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ల ఫిర్యాదు మేరకు పోలీసులు వరుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.