Peddapalli Lok Sabha constituency
Peddapalli Lok Sabha constituency : పేరుకే పెద్దపల్లి.. రాజకీయం పేరు చెప్తే పెద్ద లొల్లి ! పాలిటిక్స్ అలానే ఉంటాయ్ ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో ! వివాదాలు, విభేదాలు.. లెక్కేసి కొడితే చాలా అంశాలు రాజకీయంలో నిప్పులు రాజేస్తుంటాయ్. కాకలు తీరిన కాకాలను పరిచయం చేసింది.. ఉద్యమం సమయం నుంచి అసలైన కదలిక మొదలైంది అక్కడే ! కాకా అలియస్ గుడిసెల వెంకటస్వామికి ఆ తర్వాత తన తనయుడు వివేక్కు రాజకీయంగా గట్టి పునాది పడింది పెద్దపల్లిలోనే ! పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట. అలాంటి స్థానాన్ని కారు కబ్జా చేసేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కారు జోరుకు తిరుగులేకుండా పోయింది. రోజుకో రకంగా రాజకీయం మారుతున్న వేళ.. పెద్దపల్లి పార్లమెంట్ స్థానంతో పాటు దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పొలిటికల్ సీన్ ఇంట్రస్టింగ్గా కనిపిస్తోంది. పెద్దపల్లి రాజకీయం పార్టీలకు విసురుతున్న సవాళ్లు ఏంటి.. సిట్టింగ్లకే మళ్లీ కారు పార్టీ చాన్స్ ఇస్తుందా.. హస్తాన్ని నడిపించేది ఎవరు.. కమలం పార్టీ నుంచి బరిలో దిగేది ఎవరు.. జనం కోపం ఎదుర్కొంటున్న నేతలు ఎవరు.. ఏ నియోజకవర్గంలో ఎలాంటి లుకలుకలు ఉన్నాయ్.. ఏ విభేదాలు పార్టీలను టెన్షన్ పెడుతున్నాయ్..
కొన్ని స్థానాలు ఉంటాయ్.. పేరు చెప్తే చాలు.. ఏం జరుగుతుందా అనే ఆసక్తి ఆటోమెటిక్గా మొదలవుతుంది. అలాంటి పార్లమెంట్ నియోజకవర్గమే పెద్దపల్లి ! మహానేతలకు రాజకీయ పునాది వేసిన చోటు.. రాజకీయంలో మహామలుపులకు కారణం అయిన చోటు.. అందుకే ఇంత ఆసక్తి ! ఈ నాలుగేళ్లలో పెద్దపల్లి చుట్టూ జరిగిన రాజకీయం అంతా ఇంతా కాదు. పలకరించిన వివాదాలు.. పార్టీలను టెన్షన్ పెట్టిన వివాదాలు ఎన్నో ! అలాంటి పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫైట్ ఎలా ఉంటుందా అని తెలంగాణ అంతా ఆసక్తిగా గమనిస్తోంది. ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేసింది అన్న రేంజ్లో ఇక్కడ రాజకీయం రగులుతోంది.
venkatesh, eswar, janardhan
బీఆర్ఎస్ నుంచి పెద్దపల్లి ఎంపీ టికెట్ ఎవరికి ? సుమన్ మళ్లీ పార్లమెంట్లో కనిపిస్తారా ?
పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం ఎస్పీ రిజర్వ్డ్. పెద్దపల్లి, మంథని, రామగుండం, మంచిర్యాలతో పాటు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలైన ధర్మపురి, చెన్నూరు, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయ్. 1962లో పెద్దపల్లి పార్లమెంట్కు మొదటిసారి ఎన్నికలు జరగగా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేవరకు కాంగ్రెస్కు కంచుకోటలా ఉంది. మధ్యలో టీడీపీ రెండుసార్లు విజయం సాధించినా.. తిరిగి కాంగ్రెస్ చేతుల్లోకి వచ్చేసింది. పెద్దపల్లి పేరు చెప్తే వినిపించే పేరు కాకా అలియాస్ వెంకస్వామి. ఐతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పెద్దపల్లిని కారు కబ్జా చేసింది. 2014 లోక్సభ ఎన్నికల్లో కాకా తనయుడు వివేక్పై.. ఆ సమయంలో ఉస్మానియా విద్యార్థి నాయకుడిగా ఉన్న బాల్కసుమన్ విజయం సాధించారు. 2019లోనూ కారు పార్టీనే పాగా వేయగలిగింది. గులాబీ పార్టీ నుంచి వెంకటేష్ నేత విజయం సాధించి.. ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నారు.
balkasuman
ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వెంకటేశ్ నేత ఆసక్తి.. కొప్పుల ఈశ్వర్ను బరిలోకి దింపాలని బీఆర్ఎస్ ఆలోచన
ఈసారి పెద్దపల్లి పోటీ ఆసక్తి రేపడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుత ఎంపీ వెంకటేష్ నేత.. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అధిష్టానం దానికి అంగీకరిస్తే.. పెద్దపల్లి లోక్సభ స్థానం నుంచి ప్రస్తుత మంత్రి కొప్పుల ఈశ్వర్ను బరిలోకి దింపేందుకు బీఆర్ఎస్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ మీద దండయాత్ర ప్రకటించిన వేళ.. జాతీయస్థాయిలో తన పక్కన యువ నేతలుండాలని గులాబీబాస్ అనుకుంటే మాత్రం.. మరోసారి బాల్క సుమన్ను ఎంపీ బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది. మాజీ ఎంపీ వివేక్ అసెంబ్లీకి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నా.. ఆ సమయంలో పరిస్థితులను బట్టి.. లోక్సభ ఎన్నికల్లోనూ ఇక్కడి నుంచి బీజేపీ తరఫున ఆయన పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని కమలనాథులు అంటున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి బోడ జనార్థన్ టికెట్ రేసులో ఉండగా ఆయనకు ఎలాంటి పోటీ కనిపించడం లేదు. బీఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయ్.
eswar,suman,lakshman,vivek
ధర్మపురి సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రి కొప్పుల ఈశ్వర్.. ధర్మపురికి బాల్క సుమన్ షిఫ్ట్ అయ్యే చాన్స్
పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో కీలక నియోజకవర్గం.. ధర్మపురి ! ఇది ఎస్సీ రిజర్వ్డ్. మంత్రి కొప్పుల ఈశ్వర్ సిట్టింగ్ ఎమ్మెల్యే. మరోసారి బరిలోకి దిగేందుకు ఆసక్తితో ఉన్నా.. ఆయనను ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. అదే నిజం అయితే.. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్.. ధర్మపురికి షిఫ్ట్ అయ్యే చాన్స్ ఉంది. సొంత జిల్లా నుంచి పోటీ చేయాలన్నది సుమన్ కల. కొప్పుల ఎంపీగా పోటీ చేస్తే.. ఆయనకు ఆ కల నెరవేరే చాన్స్ ఉందన్న చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్.. ఈసారి బరిలో నిలవడం ఖాయం. బీజేపీ నుంచి పోటీ చేయడానికి వివేక్ గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారు. ఐతే గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన కన్నం అంజయ్య… వివేక్ రాకను వ్యతిరేకిస్తున్నారు. ఇద్దరి మధ్య టికెట్ ఫైట్ కనిపిస్తోంది. ఏదేమైనా ఈ సారి.. ధర్మపురిలో తొలిసారి ట్రయాంగిల్ ఫైట్ ఖాయంగా కన్పిస్తోంది.
READ ALSO : Adilabad Lok Sabha Constituency : రాజకీయాలకు అడ్డాగా కుమ్రం భీమ్ పోరుగడ్డ… అదిలాబాద్ పై కన్నేసిన కమలం
Korukanti Chandar
రామగుండం టికెట్ రేసులో మూడు పార్టీల జిల్లా అధ్యక్షులు.. బీఆర్ఎస్ నుంచి టికెట్ కోసం తీవ్రమైన పోటీ
బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్.. ఈ మూడు పార్టీల జిల్లా అధ్యక్షులు.. రామగుండం బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉండడం.. ఎన్నికల పోరును ఆసక్తికరంగా మార్చుతోంది. 2018 ఎన్నికల్లో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన కోరుకంటి చందర్.. ఆ తర్వాత గులాబీ కండువా కప్పుకున్నారు. ఇది ఆయనకు మైనస్గా మారే చాన్స్ ఉందన్న చర్చ నడుస్తోంది. ఫార్వర్డ్ బ్లాక్ ఎమ్మెల్యేనే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు అంటూ ఇప్పటికే నియోజకవర్గంలో సెటైర్లు పేలుతున్నాయ్. బీఆర్ఎస్ నుంచి టికెట్ కోసం తీవ్రమైన పోటీ కనిపిస్తోంది. కోరుకంటి చందర్తో పాటు.. బీఆర్ఎస్ అనుబంధం కార్మిక సంఘమైన టీజీబీకేఎస్ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యా రాణి టికెట్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. చందర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబడితే.. ఆయన గత ఎన్నికల్లో పోటీ చేసిన ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ప్రత్యర్థులు బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయ్. బీజేపీ నుంచి ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ పోటీకి సిద్ధం అవుతుండగా.. ఆ పార్టీ సీనియర్లు ఆయనకు వ్యతిరేకంగా ఏకం అవుతున్నారు. దీంతో సోమారపు హస్తం గూటికి చేరుతారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి శాప్ మాజీ చైర్మన్, జిల్లా పార్టీ అధ్యక్షుడు మక్కాన్సింగ్ టికెట్ సింగ్కు టికెట్ దాదాపు కన్మార్మ్. సోమారపు బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరితే.. సీన్ మారే అవకాశాలు ఉన్నాయ్.
sridhar,madhu
మంథనిలో కాంగ్రెస్ను టెన్షన్ పెడుతున్న గ్రూప్ తగాదాలు.. శ్రీధర్ బాబు, పుట్టా మధు మధ్యే ప్రధాన పోటీ
ఫ్యాక్షన్ తరహా యాక్షన్ పాలిటిక్స్కు కేరాఫ్ అయిన మంథని రాజకీయాలు.. మరింత ఆసక్తి రేపుతున్నాయ్. ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీధర్ బాబు కాంగ్రెస్ నుంచి మరోసారి బరిలోకి దిగబోతున్నారు. బీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీలో నిలుస్తారన్నదే హాట్టాపిక్ అవుతోంది. పెద్దపల్లి ప్రస్తుత జడ్పీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు.. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆయనకు అవకాశం వస్తుందా రాదా అన్న దానిపై జోరు చర్చ నడుస్తోంది. అధిష్టానంతో సంబంధాలు తెగిపోయాయని… బీఆర్ఎస్ వీడి పుట్టామధు త్వరలో బీజేపీలో చేరుతారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలను పుట్టా మధు ఎప్పటికప్పుడు ఖండిస్తున్నా.. ఈ వ్యవహారం రేపుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. మంథని టికెట్ కోసం కాటారం
సింగిల్ విండో చైర్మన్ నారాయణరెడ్డి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. దీంతో గులాబీ బాస్ నిర్ణయం ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి కుమారుడు సునీల్ రెడ్డి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటుండగా.. ఊహించని చేరికలు జరిగితే ఆశలు గల్లంతవడం ఖాయం. గ్రూప్ తగాదాలు కాంగ్రెస్ను టెన్షన్ పెడుతుండగా.. శ్రీధర్ బాబు వాటికి ఎలా చెక్ పెడతారన్న దాని మీదే తర్వాత అడుగులు ఆధారపడి ఉంటాయ్. ఎవరు ఏ పార్టీ నుండి పోటీ చేసినా…మరోసారి పాతకాపులు శ్రీధర్బాబు, పుట్టామధు మధ్యే మంథని పోరు రసవత్తరంగా మారనుందడంలో ఎలాంటి అనుమానం లేదు.
manoharreddy,mamatha,vijayaramanarao
పెద్దపల్లి అసెంబ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా దాసరి మనోహర్ రెడ్డి.. బీఆర్ఎస్ టికెట్ కోసం ఎమ్మెల్సీ భానుప్రసాదరావు పావులు
పెద్దపల్లి అసెంబ్లీ పోరు ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం దాసరి మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. రాబోయే ఎన్నికల్లో వారసురాలిగా తన కోడలు మమతా రెడ్డిని అసెంబ్లీ బరిలో నిలిపేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారన్న చర్చ నడుస్తోంది. ప్రస్తుతం మమత పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్గా కొనసాగుతున్నారు. ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు కూడా గులాబీ పార్టీ నుంచి టికెట్ కోసం పావులు కదుపుతున్నారు. బీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కపోతే.. బీజేపీ నుంచి అయినా సరే తన కోడలిని అసెంబ్లీ బరిలో నిలపాలని మనోహర్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కమలం పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, ఎన్ఆర్ఐ సురేష్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. వీరిలో ప్రదీప్ కుమార్ వైపే రాష్ట్ర పార్టీ పెద్దలు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే విజయరమణ రావు పోటీ చేయబోతున్నారు. బీఎస్పీ నుంచి ఎన్ఆర్ఐ
దాసరి ఉషా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. పెద్దపల్లిలో బీజేపీ పుంజుకుంటుండడంతో ముక్కోణ యుద్ధం ఖాయంగా కనిపిస్తోంది.
diwakar rao, vijithrao,raghunadh,premsagar
మంచిర్యాల నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన దివాకర్…బీజేపీ నుంచి పోటీలో వెరబెల్లి రఘునాథ్
మంచిర్యాలలో బీఆర్ఎస్ నుంచి నడిపెల్లి దివాకర్ రావు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇప్పటికీ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన.. మంచిర్యాల ప్రాంతానికి చేసిందేమీ లేదనే ప్రచారం ఉంది. ఇది ఆయనకు భారీ మైనస్ అయ్యే అవకాశం ఉంది. రాబోయే ఎన్నికల్లో దివాకర్ రావు స్థానంలో.. ఆయన కుమారుడు విజిత్ రావు పోటీకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయ్. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్ లేదా ఆయన సతీమణి సురేఖ బరిలో నిలవడం ఖాయమైంది. బీజేపీ నుంచి వెరబెల్లి రఘునాథ్ పోటీలో నిలవబోతున్నారు. చురుకైన నేతగా పార్టీలో ఆయనకు పేరు ఉంది. దీంతో టికెట్ ఆయనకే కన్ఫార్మ్ అని తెలుస్తోంది.
chinnayya,vinodh
బెల్లంపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను టెన్షన్ పెడుతున్న పార్టీ విభేదాలు.. కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగనున్న గడ్డం వినోద్
బెల్లంపల్లి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి దుర్గం చిన్నయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికలలో మాజీ మంత్రి గడ్డం వినోద్పై ఆయన విజయం సాధించారు. బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్యపై వ్యతిరేకత ఉంది. పైగా వర్గ విభేదాలు ఆయనను ఇబ్బందులు పెడుతున్నాయ్. దుర్గం చిన్నయ్యతో పాటు.. జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ కూడా బీఆర్ఎస్ నుంచి బెల్లంపల్లి టికెట్ ఆశిస్తున్నారు. సిట్టింగ్లకే టికెట్ అని కేసీఆర్ ప్రకటించారు. దీంతో అసంతృప్త వర్గం ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది బెల్లంపల్లి రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. మాజీ మంత్రి గడ్డం వినోద్.. ఈసారి కాంగ్రెస్ నుంచి అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు. బీజేపీ నుంచి మాజీ ఎంపీ వివేక్ ఇక్కడి నుంచి పోటీకి దిగొచ్చంటూ ప్రచారం జరుగుతోంది. సోదరుడు వినోద్ మీద ఆయన పోటీ చేస్తారా అనే అనుమానాలు కూడా ఉన్నాయ్.
BalkaSuman,janardhan,odelu
చెన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్ బాల్క సుమన్.. బీఆర్ఎస్ నుంచి టికెట్ రేసులో నల్లాల ఓదేలు
చెన్నూరు నుంచి ప్రస్తుతం బాల్క సుమన్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. నియోజకవర్గంలో ఆయనకు పెద్దగా వ్యతిరేకత లేకపోయినా.. హైదరాబాద్కే పరిమితం అయ్యారనే వాదనలు ఉన్నాయ్. ఐతే ఆయన చెన్నూరు నుంచి పోటీ చేస్తారా.. ధర్మపురికి వెళ్తారా అనే చర్చ కూడా నడుస్తోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వెళ్లి మళ్లీ బీఆర్ఎస్కు వచ్చిన నల్లాల ఓదేలు కూడా టికెట్ కోసం క్యూలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి మాజీమంత్రి బోడ జనార్థన్తో పాటు.. దుర్గం అశోక్ టికెట్ ఆశిస్తున్నారు. బీజేపీ నుంచి అందుగుల శ్రీనివాస్ టికెట్ మీద కోటి ఆశలు పెట్టుకున్నారు. ఐతే మాజీ ఎంపీ వివేక్.. పెద్దపల్లి లోక్సభ నుంచి బీజేపీ తరఫున పోటీకి దిగాల్సి వస్తే.. తన కుమారుడికి చెన్నూరు నుంచి బరిలో దింపేందుకు పావులు కదుపుతున్నారు. ఇలా పెద్దపల్లి చుట్టూ ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్నారు. పట్టుదల, పంతం కలబోసిన రాజకీయం పెద్దపల్లి చుట్టూ కనిపిస్తోంది. దీంతో ఎన్నికలు మరింత రసవత్తరంగా మారడం ఖాయం.