PM Modi : తెలంగాణకు ప్రధాని మోదీ.. టూర్ షెడ్యూల్ ఖరారు
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. PM Modi
- Naveen
- Published On : September 27, 2023 / 01:11 AM IST
PM Modi - Telangana Tour
PM Modi – Telangana Tour : ప్రధాని మోదీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ప్రధాని రాష్ట్ర టూర్ షెడ్యూల్ ఖరారైంది. అక్టోబర్ 1న 1.30 గంటలకు ప్రధాని మోదీ హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. హైదరాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు మహబూబ్నగర్ వెళ్లనున్నారు. 3.15 నుంచి 4.15 గంటల వరకు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత తిరిగి 5గంటల 05 నిమిషాలకు బేగంపేట చేరుకుని ఢిల్లీకి వెళ్లనున్నారు.
ప్రధాని టూర్ కి సంబంధించి రాష్ట్ర బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ టూర్ లో భాగంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు చేయనున్నారు. అలాగే భారీ బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల సమరశంఖాన్ని పూరించనున్నట్టు సమాచారం.
ప్రధాని మోదీ మహబూబ్ నగర్ పర్యటనపై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. పాలమూరుకు ఏం చేశారని ప్రధాని మోదీ వస్తున్నారని ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తపోతల ప్రాజెక్ట్ పర్మిషన్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారని కేటీఆర్ మండిపడ్డారు. ప్రధాని మోదీ ఓట్ల వేట కోసమే మహబూబ్ నగర్ వస్తున్నారని ఆరోపించారు. పదేళ్ల నుండి కృష్ణా జలాల్లో వాటా తేల్చడం లేదని.. కృష్ణా జలాల్లో ఏపీ, తెలంగాణ వాటా తేల్చాకే ప్రధాని మోదీ మహబూబ్ నగర్ కి రావాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల్లో ఒక్క ప్రాజెక్ట్కు కూడా జాతీయ హోదా ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. బీజేపీ జాతీయ పార్టీ కాదని.. జాతిని మోసం చేసిన పార్టీ అని విమర్శించారు. తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీ బీజేపీ అని విరుచుకుపడ్డారు. కొత్త పార్లమెంట్లో తొలిరోజే తెలంగాణపై విషం చిమ్మారని.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎందుకు అవనమానిస్తున్నారని కేటీఆర్ సీరియస్ అయ్యారు.
Also Read..Telangana High Court : ఎమ్మెల్యే గొంగిడి సునీతపై హైకోర్టు ఆగ్రహం, భారీ జరిమానా
