PM Modi
PM Modi : ఈనెల 26న దేశవ్యాప్తంగా 500కుపైగా అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు, దాదాపు 1500 రైల్వే ప్లైఓవర్లు, అండర్ పాస్ లకు ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేస్తారు. మరికొన్నింటిని జాతికి అంకితం చేయనున్నారు. 2014 లో మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటినుంచి రైల్వేశాఖకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తోంది. ఇందులోభాగంగా కొత్త రైల్వేలైన్లతో పాటు, రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాలలో డబ్లింగ్, ట్రిప్లింగ్, క్వాడ్రప్లింగ్ లైన్ల నిర్మాణం అత్యంత వేగంగా సాగుతోంది. అంతేకాకుండా, రైల్వేలలో 100శాతం విద్యుద్దీకరన సాధన లక్ష్యంగా పని చేస్తున్న భారతీయ రైల్వే ఆ దిశగా చేపట్టిన పనులు పెద్దఎత్తున పురోగతి సాధించాయి.
వీటితోపాటుగా రైల్వే క్రాస్ ల వద్ద రద్దీని నివారించడానికి వీలుగా అవసరాన్ని బట్టి రైల్వే ఫ్లై ఓవర్లను, రైల్ అండర్ పాస్ లను నిర్మిస్తూ వస్తోంది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన కవచ్ వ్యవస్థను దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్ లలో అమలు చేసే పనులు వేగంగా సాగుతున్నాయి. రైళ్లు, రైల్వే లైన్ల విస్తరణ మీద మాత్రమే కాకుండా రైల్వేస్టేషన్లను ఆధునీకరించి, అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను కల్పించాలని మోదీ ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా “అమృత్ భారత్ స్టేషన్ల” పేరిట నూతన పథకాన్ని ప్రారంభించిన భారతీయ రైల్వే.. దేశవ్యాప్తంగా ఉన్న అనేక రైల్వేస్టేషన్లను ఆధునీకరించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 500కుపైగా అమృత్ భారత్ రైల్వే స్టేషన్లుతోపాటు, దాదాపు 1500 రైల్వే ప్లై ఓవర్లు, అండర్ పాస్ లకు ప్రధాని మోదీ 26న భూమి పూజ చేయనున్నారు.
తెలంగాణలో ఇలా..
తెలంగాణ రాష్ట్రంలో 40 రైల్వేస్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లుగా అభివృద్ధి చేయాలని రైల్వేశాఖ భావించింది. ఇందుకోసం మొత్తం రూ. 2,245 కోట్ల నిధులను కేటాయించింది. 40 అమృత్ భారత్ రైల్వేస్టేషన్లకుగాను, గత ఆగస్టు నెలలో 21 అమృత్ భారత్ స్టేషన్లలో రూ. 894 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పుడు మరో 15 అమృత్ భారత్ స్టేషన్లలో రూ. 230 కోట్లకు పైగా నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఈనెల 26న ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేయనున్నారు.
Also Read : టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి.. చంద్రబాబు ఫ్లెక్సీలను చించేసి నిరసన
మోదీ, రైల్వే శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన కిషన్ రెడ్డి..
తెలంగాణ రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి ఇంత పెద్దఎత్తున సహకరిస్తుండటం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు ధన్యవాదాలు తెలియజేశారు. 2014-15 లో రూ. 258 కోట్లుగా ఉన్న తెలంగాణ రైల్వే బడ్జెట్ కేటాయింపులను కేవలం 10 సంవత్సరాల కాలంలోనే దాదాపు 20 రెట్లు పెంచి 2024-25 నాటికి రూ. 5,071 కోట్లకు చేర్చడం తెలంగాణలో రైల్వేల అభివృద్ధి మీద మోదీ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను తెలియజేస్తుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.