Jubilee Hills chain snatching case
Jubilee Hills chain snatching case : జూబ్లీహిల్స్ చైన్ స్నాచింగ్ ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో బుధవారం జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో 33ఏళ్ల మహిళ 23ఏళ్ల యువకుడితో కలిసి చైన్ స్నాచింగ్కు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. జల్సాల కోసం ప్రియుడితో కలిసి ఆమె ఈ పనులకు పాల్పడినట్లు గుర్తించారు.
Also Read : Kavitha : మే మొదటి వారంలో కొత్త పార్టీని ప్రకటిస్తాం.. ఎన్నికల్లో సిద్ధిపేట నుంచి పోటీ..
హైదరాబాద్ మాదాపూర్ ప్రాంతంలోని ఓ హాస్టల్ లో నివాసం ఉంటున్న మానస అనే యువతి జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 39లోని సాప్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్ గా పనిచేస్తుంది. ఆమె మంగళవారం ఉదయం హాస్టల్ నుంచి తన ఆఫీసుకు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 44 వద్ద ఓ ఇద్దరు యాక్టివా బైక్ పై మానస దగ్గరకు దూసుకొచ్చారు. ఆ బండి వెనుక సీట్లో కూర్చున్న యువతి మానస మెడలో ఉన్న గొలుసుని లాగేసింది. ఆ వెంటనే వారు అక్కడి నుంచి పరారయ్యారు. మానస వెంటనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చైన్ స్నాచింగ్ కు పాల్పడిన వారిని గుర్తించే పనిలోపడ్డారు.
ఘటన జరిగిన ప్రాంతంలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. అందుకు సంబంధించి సీసీ ఫుటేజ్లను సేకరించి.. అన్ని పోలీస్ స్టేషన్లకు పంపారు. వాటి ఆధారంగా ఏపీకి వెళ్లున్న వారిని తెలంగాణ సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. వారిని జూబ్లీహిల్స్ పోలీసులు విచారించగా.. కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
విలాసవంతమైన జీవితం గడపాలని ఈ జంట చైన్స్నాచింగ్లకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో పేర్కొన్నారు. ఇద్దరూ సన్నిహిత సంబంధం కలిగి ఉన్నట్లు, జల్సాల కోసం సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నగరంలోని పలు ప్రాంతాల్లో కొందరు మహిళలను లక్ష్యంగా ఎంచుకుని వీరు చైన్స్నాచింగ్కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి దొంగిలించిన బంగారం గొలుసులు, ఉపయోగించిన వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మరిన్ని వివరాలకోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.