Ponguleti Srinivas Reddy
Ponguleti Srinivas Reddy – Khammam: ఖమ్మంలో నిర్వహిస్తోన్న జనగర్జన సభలో కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సమక్షంలో ఆ పార్టీలో చేరారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అలాగే, పలువురు నేతలను కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రాహుల్ గాంధీ.
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఆయనను రాహుల్ సత్కరించారు. ఎమ్మెల్యే సీతక్కను కూడా భుజం తట్టి అభినందించారు రాహుల్. వేదికపై రాహుల్ గాంధీకి ప్రజా గాయకుడు గద్దర్ ముద్దు పెట్టారు.
అంతకుముందు ఖమ్మం సభా ప్రాంగణం వద్ద హెలికాప్టర్ దిగగానే చేరుకోగానే గాంధీని కాంగ్రెస్ కార్యకర్తలు చుట్టుముట్టారు. వారికి అభివాదం చేస్తూ వేదికపైకి వెళ్లారు. రాహుల్ గాంధీతో పాటు వేదికపై రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, మాణిక్రావు ఠాక్రే, గిడుగు రుద్రరాజు, ఇతర కీలక కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
ఖమ్మంలో కాంగ్రెస్ తలపెట్టిన ‘తెలంగాణ జన గర్జన’ బీఆర్ఎస్ వెన్నులో వణుకుపుట్టిస్తోందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్ రెడ్డి అన్నారు. సభకు వచ్చే అశేష జనవాహినికి ట్రాన్స్ పోర్టు అడ్డంకులు సృష్టించి, సంక్షేమం కట్ చేస్తామని బెదిరించి ప్రభంజనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. అధికారులు పద్ధతి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.