Prakash Yashwant Ambedkar: దళిత బంధు పథకం ఫలాలు వారికి కూడా అందించాలని సీఎం కేసీఆర్ను కోరుతా..
దళిత బంధు పథకం రాష్ట్రంలో సరికొత్త ప్రయోగమని, ఈ పథకం ప్రవేశ పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు చెబుతున్నానని ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్ అన్నారు.
- Harishth Thanniru
- Published On : April 14, 2023 / 02:45 PM IST
Prakash Yashwant Ambedkar
Prakash Yashwant Ambedkar: రాజ్యంగ రూపశిల్పి భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణ హైదరాబాద్లో జరగనుంది. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు గౌరవ అతిథిగా బాబాసాహెబ్ అంబేద్కర్ మనుమడు, మాజీ లోక్సభ సభ్యులు ప్రకాశ్ అంబేద్కర్ ను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు గురువారం రాత్రి ఆయన హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం ఆయన కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. హుజురాబాద్, జమ్మికుంటలో తెలంగాణ ప్రభుత్వం దళితుల ఆర్థికాభివృద్ధికోసం అమలు చేస్తున్న దళిత బంధు పథకం లబ్ధిదారుల యూనిట్లను పరిశీలించారు. అనంతరం హుజురాబాద్ పట్టణంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్ మాట్లాడుతూ.. దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు చెప్పారు.
దళిత బంధు పథకం రాష్ట్రంలో సరికొత్త ప్రయోగమని, ఈ పథకం ప్రవేశ పెట్టిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెబుతున్నానని ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్ అన్నారు. ఈ పథకం ప్రవేశ పెట్టక ముందు వీళ్లంతా మరొకరి వద్ద ఉద్యోగాలు చేయవల్సిన స్థితి ఉండేదని, దళిత బంధు పథకం అమలుతో వారు మరికొందరికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వచ్చారని అన్నారు. అయితే, ఈ పథకాలు పడ్బందీగా అమలు చేస్తే మరింత మందికి ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. చదువుతో పాటు ఉపాధి కల్పించే పథకాలు అమలు చేస్తేనే దళితుల జీవన ప్రమాణాలు పెరుగుతాయని, బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటి కౌంటర్ గ్యారంటీ అడగడమే ఇబ్బందులను తెచ్చిపెడుతుందని అన్నారు.
Minister Harish Rao: అంబేద్కర్ విగ్రహం ఆకారానికి ప్రతీక కాదు.. తెలంగాణ ప్రజల చైతన్య దీపిక
గత 70 ఏళ్లుగా జీవన ప్రమాణాలు మెరుగు పడక పోవడంవల్ల ఇబ్బంది పడుతున్న తీరును స్వయంగా చూశానని, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు లాంటి పథకాలు ఇతర రాష్ట్రాలుకూడా అమలు చేస్తే బాగుంటుందని ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్ పేర్కొన్నారు. ఈ పథకం దేశానికే ఆదర్శం కావాలని కోరుకుంటున్నానని ఆకాంక్షించారు. 30% దారిద్ర్య రేఖ దిగువున ఉన్న మిగితా బలహీన కులాలను దళిత బంధులో చేర్చాలని సీఎం కేసీఆర్ను కోరుతానని చెప్పారు.
