Primitives landmarks : నాగార్జున సాగర్ పరిసర ప్రాంతాల్లో ఆదిమానవుని అడుగుజాడలు బయటపడ్డాయి. సాగర్ ఎగువన, నల్లొండ జిల్లా పెద్ద అడిసేర్లపల్లి మండలం పుట్టంగండి పంచాయతీ పరిధిలోని పావురాల గుట్టకు సమీపంలో ఆనవాళ్లు వెలుగుచూశాయి. కృష్ణానది ఒడ్డున పెద్ద పలుగు గుట్టపై ఆధారాలున్నాయని పురావస్తు పరిశోధకులు, బౌద్ధ నిపుణులు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. క్షేత్రపర్యటనలో భాగంగా గురువారం సెప్టెంబర్(16, 2021) గుట్టపై మూడు చోట్ల 5 నుంచి 8 సెం.మీ వ్యాసం, 1 సెం.మీ లోతుతో బిడిసె రాళ్లను గుర్తించామని పేర్కొన్నారు.
కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో పశుపాలనతో పాటు వ్యవసాయం చేసిన కొత్త రాతియుగపు మానవులు పదునైన మొనగల నల్ల శానపు రాతి గొడ్డళ్లు తయారు చేసుకునేవారని, పెద్ద పలుగు రాతి గుట్ట వారి పనిముట్ల తయారీ కేంద్రంగా ఉండేదని గుట్టపై ఉన్న గుంతలు రుజువు చేస్తున్నాయని వెల్లడించారు.
Historical Primitives Landmarks : సిద్దిపేటలో ఆదిమానవుడి ఆనవాళ్లు.. 15వేల ఏళ్ల నాటి పురాతన వస్తువులు
పలుగు గుట్టకు దిగువన ఉన్న కొత్త రాతియుగపు కొండచరియ ఆవాసాలను కూడా పరిశీలించామని తెలిపారు. ఇక్కడ ఆర్కియాలజికల్, ఎకో టూరిజం అభివృద్ధి చేస్తే స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. బుద్ధవనం ప్రాజెక్టు వోఎస్డీ కద్దూరి సుధన్రెడ్డి, నర్సింగరావు, పావురాలగుట్ట యువకుడు గోసంగి సైదులు పాల్గొన్నారు.