Telangana Congress : పాలేరు, ఖమ్మం నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ రోడ్ షో నిర్వహించారు. పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలంలోని నాయుడుపేట, వరంగల్ క్రాస్ రోడ్డు, ఖమ్మం నగరంలోని పాత బస్టాండు సెంటర్ వరకు ప్రియాంక గాంధీ రోడ్ షో నిర్వహించారు. ఈ క్రమంలో గిరిజన మహిళలతో కలిసి స్టెప్పులు వేశారు. ప్రచార వాహనం పై ఉండి చప్పట్లు కొడుతూ డ్యాన్స్ చేశారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో ప్రజలనుద్దేశించి ప్రియాంక మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
కేసీఆర్ కుటుంబంకు ఉద్యోగాలు వచ్చాయి.. మీలో ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా అంటూ ప్రియాంకగాంధీ ప్రశ్నించారు. ఉద్యోగం కావాలంటే కేసీఆర్ ను ఓడించండని పిలుపునిచ్చారు. సబ్బండ వర్గాల పోరాటాల ఫలితంగానే సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంతో మీ జీవితాలు బాగుపడతాయని అనుకున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించారంటూ ప్రియాంక గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో సంపద పేదలకు పంచామని అన్నారు.
యువతకు ఉద్యోగం వచ్చే ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి.. రైతాంగం రుణాలు మాఫీ చేసే ప్రభుత్వం ఏర్పాటు చేయాలి.. శక్తివంతమైన ప్రభుత్వంను ఏర్పాటు చేయాలి.. అలా జరగాలంటే కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రియాంక గాంధీ సూచించారు. మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలి.. కాంగ్రెస్ తోనే సబ్బండ వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, మల్లు భట్టి విక్రమార్క లను గెలిపించాలని ప్రియాంక గాంధీ ప్రజలను కోరారు. చివరిలో ప్రియాంక గాంధీ జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.